గిరిజన జాతి ప్రయోజనాల కొరకు జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ,జయంతి వేడుకల్లో శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఆరాధ్య దైవమని,సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడ నిర్వహించడం లేదని అన్నారు.300 సంవత్సరాల క్రితమే మనం ఎలా జీవించాలో చెప్పిన గొప్ప మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని,తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా లకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసిన ఘనత సిఎం కెసిఆర్ కె దక్కిందని అన్నారు.
70 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కెసిఆర్ దే అన్నారు. నడిచి కూడా వెళ్ల లేని స్థితిలో ఉన్న తండాలకు నేడు సిసి రోడ్లు,డ్రైనేజీ లు, మంచి నీటి వసతి ,విద్యుత్తు,విద్యా వసతులు కల్పించి అభివృద్ధి చేసిందన్నారు.తండాలకు గిరిజన బిడ్డలే ప్రజా ప్రతినిధులుగా ఉంటూ రాజ్యాధికారంలో భాగస్వాములు అయ్యారని అన్నారు.
పూట గడవని స్థితిలో గంజి తాగి బతికే గిరిజన బిడ్డల కోసం నేడు ప్రభుత్వం గిరిజన సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యతో పాటు అన్ని పోషక విలువలు కలిగిన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారని,గిరిజన బిడ్డల వివాహాలకు కళ్యాణ లక్ష్మీ పధకంతో పాటు మిగిలిన సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు.
గిరిజనుల పక్షపాతిగా సిఎం కెసిఆర్ భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు నిరంతరాయంగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ గిరిజనుల్లో చైతన్యం తీసుకు వచ్చింది అన్నారు.
గిరిజనులకు సేవాలాల్ జయంతి, ముస్లింలకు రంజాన్ ఇఫ్తార్ విందులు, హిందువులకు బతుకమ్మ పండుగకు చీరలు,క్రైస్తవులకు క్రిస్మస్ కు విందులు, గిఫ్టు ప్యాక్ లు అందిస్తూ ప్రభుత్వం అన్ని కులాల,మతాల విశ్వాసాలకు అండగా నిలబడుతుంది అన్నారు. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లను కూడా సాధించి తీరుతామని అన్నారు.హుజూర్ నగర్ పట్టణంలో బంజారా భవన నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా శాసనసభ్యుడు సైదిరెడ్డి ని గిరిజనులు భారీగా సన్మానించారు.గిరిజనుల తలపాగా చుట్టుకొని సైదిరెడ్డి ప్రారంభోపన్యాసంలో రామ్ రామ్ అంటూ అభివాదం చేశారు.ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీతో వేదిక వద్దకు ఘనస్వాగతం పలుకుతూ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు,గురువులు,మండల పార్టీ అధ్యక్షులు,గిరిజన సోదరులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్