39.2 C
Hyderabad
April 28, 2024 14: 23 PM
Slider హైదరాబాద్

విదేశాల్లో విద్యను అభ్యసించే స్థాయికి తీసుకువెళతాం

#Minister Sabitha Indra Reddy

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులు విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి తీర్చిదిద్దే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సభితా ఇంద్రారెడ్డి, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తెలిపారు.

సోమవారం సనత్ నగర్ లోని అశోక కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ మన బడి కార్యక్రమం క్రింద 2.22 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను, బన్సీలాల్ పేట లోని ప్రభుత్వ పాఠశాలలో 1.84 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 16 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను, MLC నిధులు 25 లక్షల రూపాయలు, ACDP నిధులు 7.70 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 3 అదనపు తరగతి గదులను ప్రారంభించారు.

మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, MLC సురభి వాణిదేవి, విద్యాశాఖ కమిషనర్ దేవసేన లతో కలిసి ప్రారంభించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యార్ధుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పేద విద్యార్ధులు అధికంగా విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో మన బస్తీ మన బడి కార్యక్రమంతో అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.

అదేవిధంగా గురుకుల పాఠశాలలను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందని వివరించారు. మంచి వాతావరణంలో విద్యను అందిస్తే భవిష్యత్ లో ఈ విద్యార్ధులు ఎన్నోఅద్భుతాలు సృష్టిస్తారనే అపారమైన సమ్మకం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి ఉన్నదని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యార్ధులు ఆకలితో ఉంటే విద్యపై సరైన శ్రద్ధ చూపలేరని ఒక తండ్రిగా ఆలోచించిన మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సన్నబియ్యం తో నాణ్యమైన భోజనం, పౌష్టికాహారంగా వారానికి 3 రోజులు రాగిజావా అందిస్తున్నట్లు తెలిపారు.

అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తూ ప్రవేట్ స్కూల్స్ కు పంపిస్తుంటారని చెప్పారు. ప్రభుత్వ స్కూల్స్ లో అన్ని సౌకర్యాలు కల్పించబడుతున్నాయని, తెలుగు మీడియం తో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించడం జరిగిందని, మీ పిల్లలను ఇక్కడే చేర్పించాలని కోరారు. తమ పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత వారి చదువు పై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. అదేవిధంగా విద్యార్ధుల తల్లిదండ్రులతో నిర్వహించే సమావేశాలకు తప్పనిసరిగా హాజరై సమస్యలు ఉంటే తెలియజేయాలని అన్నారు.

హై స్కూల్ గా మేకలమండి స్కూల్

పేద ప్రజలు అధికంగా నివసించే బన్సీలాల్ పేట డివిజన్ లోని మేకల మండి లో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నుండి ఉన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సోమవారం మేకల మండి పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక MLA, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ పాఠశాల ను 2011 సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల గా ప్రారంభించడం జరిగిందని, 2020 సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల గా అప్ గ్రేడ్ చేయించడం జరిగిందని చెప్పారు.

ప్రస్తుతం ఈ పాఠశాలలో 750 మంది విద్యార్ధులు ఉన్నారని, ఉన్నత పాఠశాల గా అప్ గ్రేడ్ చేస్తే ఈ ప్రాంత విద్యార్ధులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. స్పందించిన విద్యాశాఖ మంత్రి వచ్చే విద్యా సంవత్సరం నుండి ఉన్నత పాఠశాల గా గుర్తింపునిస్తూ 10 వ తరగతి వరకు విద్యాబోధన నిర్వహిస్తామని సమావేశంలో ప్రకటించారు.గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదని, దాంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేవారని అన్నారు.

కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను విద్యార్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, వసతులతో ఎంతో గొప్పగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల హాజరుశాతం గణనీయంగా పెరిగిందని చెప్పారు. గడిచిన 9 సంవత్సరాల కాలంలో నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, విద్యాధికారి రోహిణి, పాఠశాల ప్రదానోపాద్యాయుడు మల్లిఖార్జున్, కార్పొరేటర్ హేమలత, పద్మారావు నగర్ BRS ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, పాఠశాల కమిటీ సభ్యులు చంద్రశేఖర్, నర్సింగ్ రావు, రాజు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎన్టీఆర్ ను విమర్శించిన వారు చరిత్రహీనులు అవుతారు

Satyam NEWS

ఇద్దరు పసిపిల్లలను ఉరి వేసి హత్య చేసిన తల్లి

Satyam NEWS

ఉత్తరప్రదేశ్ లో పడవ ప్రమాదం

Murali Krishna

Leave a Comment