ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని గణేష్ నగర్ లో ఈనెల 11వ తేదీన ఓ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు చేదించారు. దొంగతనానికి పాల్పడ్డ ఐదు మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. డిఎస్పి కిషోర్ కుమార్ వెల్లడించిన వివరాల మేరకు.. ఈనెల 11వ తేదీన గిద్దలూరు పట్టణంలోని గణేష్ నగర్ లో నివాసముంటున్న కూరాకు పుష్పలత తన కుటుంబ సభ్యులతో తిరుమలకు వెళ్లారని పుష్పలత వారి కుటుంబ సభ్యులు 15వ తేదీ వారి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు అన్న విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని దొంగతనానికి పాల్పడ్డ ఐదు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి తొమ్మిది లక్షల 50వేల రూపాయల నగదు,లక్ష 84 వేల రూపాయల విలువ చేసే 92 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
దొంగతనానికి పాల్పడ్డ నిందితులు కొంగలవీడు వద్ద అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నామని డిఎస్పి కిషోర్ కుమార్ చెప్పారు. దొంగతనం కేసును అతి త్వరగా చేదించిన సీఐ ఫిరోజ్ ను ఎస్సై లు బ్రహ్మనాయుడు,మహేష్, సుబ్బరాజులను జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ అభినందించారని వెల్లడించారు.