కాకినాడ నగర ప్రజలు చెల్లిస్తున్న పన్నులను, ప్రభుత్వ ఆస్తులను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకుంటున్నారని అతని వల్ల కాకినాడలో అభివృద్ధి ఏం లేదని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) విమర్శించారు. కాకినాడ ప్రజలు చెల్లించిన పన్నులతో కాకుండగా కాకినాడ పోర్టు లోని 337 ఎకరాల భూమిని పదిహేను వందల కోట్లకు తాకట్టు పెట్టి వేరే ప్రాంతానికి తరలించుకు పోతున్నారని చెప్పారు.
శనివారం కాకినాడలోని జిల్లా టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వనమాడి విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వనమాడి మాట్లాడుతూ కాకినాడ అభివృద్ధి కోసం ద్వారంపూడి ఒక్క రూపాయి నిధులను రాష్ట్ర ప్రభుత్వం నుండి తేలేక పోయారని కాకినాడ నగర ప్రజలు కడుతున్న పన్నులను దుర్వినియోగం చేసి అందులో లాభాలు పొందుతున్నారన్నారు. అలాగే కాకినాడ పోర్టునకు చెందిన 337 ఎకరాలను భూమిని 13 ఏళ్లకు తాకట్టు పెట్టి ఆ రుణాన్ని వేరే చోట పనులు చేయించి దాన్ని తిరిగి కాంటాక్ట్ ద్వారా దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
కాకినాడ పోర్టు అభివృద్ధికి, వచ్చే పరిశ్రమల కోసం ఆ భూమిని వినియోగించుకోవాలి గాని ఇలా తాకట్టు పెట్టడం ఏంటి అంటూ వనమాడి ద్వారంపూడిని ప్రశ్నించారు. అవినీతి చేయడం, అక్రమాలకు పాల్పడడమే తప్పా నగర అభివృద్ధిపై ముందు చూపులేని వ్యక్తి ఎమ్మెల్యే కావడం నగర ప్రజల దురదృష్టకరమన్నారు. కాకినాడ నగరాభివృద్ధి చేయకుండా అతను వ్యవహారిస్తున్న తీరు దాచుకో దోచుకో అనే చందంగా ఉందన్నారు.
కాకినాడ నగరంలో విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నయని దీనికి ఎమ్మెల్యే ద్వారంపూడికి కాకినాడ అర్బన్ తహశీల్దారు వైహెచ్ఎస్ సతీష్ కారణమన్నారు. దొంగ పట్టాలు ఇవ్వడం, భూములు దుర్వినియోగానికి పాల్పడిన ఆ తహశీల్డార్పై తాము కేసులు వేసామని త్వరలోనే ఆయన సస్పెండ్ అవుతారని కొండబాబు చెప్పారు. ఇప్పటికే సతీష్ అధికారులతో పాటు ఎవరికీ కనిపించకపోయినా ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంట్లో సురక్షితంగా ఉంటున్నారన్నారు. ఎమ్మెల్యే నగరంలో గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో తిరుగుతున్నాడని అతను నాలుగు వైపులా తనకు చెందిన రౌడీలను కాపలాగా పెట్టుకున్నారని కొండబాబు చెప్పారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు ఇప్పుడు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు