రాష్ట్ర పతిని కలిసి చంద్రబాబు నాయుడు ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరే హక్కు ఆయనకు లేదని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. కడప జిల్లా రాజంపేట లో వైసీపీ నేత శ్రీనివాసులురెడ్డి స్వగృహంలో మంగళవారం ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ని పట్టాభి పిచ్చి కూతలు కూసినందునే అభిమానులు ఆగ్రహించి దాడి చేశారని, చంద్రబాబును ఎవరూ నమ్మరని, వారి పార్టీ వారే ఆయనను నమ్మడం లేదని ఎద్దేవా చేశారు.
ఆర్టికల్ 356 ను రాష్ట్రంలో ఏం జరిగిందని అమలు చేయాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి వ్యవస్థ ను స్వంత ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడని ఆరోపించారు. బీజేపీ,మోడీ పై చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్ని కుట్రలు చేశారో అందరికి తెలుసన్నారు. సత్యాగ్రహ దీక్షలో చంద్రబాబు మమ్మల్ని 13 జిల్లాల వారి చేత తిట్టించారని, ఆ మాటలకు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి చెప్పినట్టు సీమలో అయితే కూనిలు జరిగేవని ఆయన చెప్పింది నిజమని సమర్ధించారు. జగన్మోహన్ రెడ్డి కి ప్రజలు ఐదు ఏళ్లు పట్టం కట్టారని,జగన్ చేసే మంచి పనులు ఓర్వలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆయనకు దమ్ము ఉంటే ప్రజలకు మేలు చేసి ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు కూడా అధికారంలోకి వస్తే అడ్డుకునేదేవరని అన్నారు.