రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని ఖమ్మం నగరం మయూరి సెంటర్ లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ లు ఘన నివాళులు అర్పించారు.
అనంతరం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు చేపట్టిన సర్వ సభ్య సమావేశంలో నగర మేయర్ అమరుల సంస్మరణ తీర్మానం ప్రవేశపెట్టగా, సభ్యులందరు ఏకగ్రీవంగా బలపరిచారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారు చేసిన త్యాగం ప్రజల గుండెల్లో పదిలంగా ఉందన్నారు.
దశాబ్ది వేడుకల్లో గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులర్పించేందుకు హైదరాబాద్ నడి బొడ్డున హుస్సేన్ సాగరతీరంలో నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నంను ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రారంభోత్సవం చేస్తున్నారని అన్నారు. ఆత్మ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో పాలన పగ్గాలు అందుకున్న ఉద్యమనేత కేసీఆర్ సర్కారు అమరుల కుటుంబాలకు అడుగడుగునా అండగా నిలుస్తూ ఆసరా నిస్తున్నదన్నారు.
రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలను రాష్ట్రం ఏర్పాటైన రెండేండ్లలోనే అక్కున చేర్చుకుందని, అమరుల కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిన విషయం గుర్తు చేశారు. 2016 జూన్ 2న రాష్ట్రం రెండో అవతరణ రోజునే దీన్ని పూర్తి చేసిందని, అమరుల కుటుంబ సభ్యుల్లో కొందరికి చదువు, వయసు వంటి నిబంధనల్లో అనేక సడలింపులు ఇచ్చి ఉద్యోగాలను కల్పించిందన్నారు.
ఇదే సమయంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరులో అసువులు బాసిన అమరులకు ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నదన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపేలా సాగుతున్న పాలనపై అమరుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలతో కూడిన ఉద్యమ ట్యాగ్లైన్ను పరిపూర్ణం చేస్తూ సాగుతుండడంపై నేడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజు గురువారం అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో, వాడవాడలా అమరులకు ఘనంగా నివాళులర్పించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందన్నారు.