పేద విద్యార్ధులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే లక్ష్యం తో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి 3 వ విడత నిదులను సీఎం జగన్ శ్రీకాకుళం నుండి బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేసారు. ఈ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం నుండి లైవ్ లో ప్రసారం చేసారు.
ఈ పధకం క్రింద జిల్లాలో 1.73 లక్షల మందికి 260.16 కోట్ల రూపాయలను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, బొత్స అప్పలనరసయ్య, శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు , బద్దుకొండ అప్పల నాయుడు , కడుబండి శ్రీనివాస రావు, నగర మేయర్ విజయలక్ష్మి, ఉప మేయర్లు ఈసపు రేవతి దేవి, కోలగట్ల శ్రావణి, డి.ఈ.ఓ జయ శ్రీ, సర్వ శిక్షా అభియాన్ పి.ఓ స్వామినాయుడు , విద్యార్ధులు తల్లిదండ్రులు పాల్గొని వీక్షించారు. పొరుగున ఉన్న సిక్కోలు జిల్లాలో సీఎం జగన్ సందేశం అనంతరం అతిధుల చేతుల మీదుగా లబ్దిదారులకు మెగా చెక్కును అందజేసారు.
అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యను పెట్టుబడిగా భావిస్తూ అనేక సంస్కరణలను చేపడుతోందని, విద్యతోనే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. పేద పిల్లవాడు ధనికున్ని చూసి బాధ పడకూడదనే కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలో యునిఫారం, బూట్లు, టై., ఇంగ్లీష్, తెలుగు మీడియం లలో పుస్తకాలు ప్రభుత్వమే సరఫరా చేస్తోందని తెలిపారు.
నాడు నేడు క్రింద పాఠశాలల రూపు మార్చి అన్ని హంగులతో పిల్లలకు సౌకర్యవంతంగా ఉండేలా తీర్చి దిద్దడం జరిగిందన్నారు. విద్యా కనుక, విద్యా దీవన, జగనన్న గోరుముద్ద, తదితర పధకాలతో తల్లి దండ్రుల చదువు బాధ్యతను, భారాన్ని ప్రభుత్వమే తీసుకుందని అన్నారు. ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీ లు, కే.జి.బి.వి లను, మోడల్ స్కూల్స్ ను అప్ గ్రేడ్ చేయడం జరిగిందని ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గతం లో ఎన్నడూ లేదని స్పష్టం చేసారు. అలంటి ప్రభుత్వాన్ని విమర్శించి ప్రజల మధ్యన చులకన కారాదని ప్రతిపక్షాలకు సూచించారు.
స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ బడి లో ఉండవలసిన పిల్లలు పనిలో ఉండడాన్ని తన పాద యాత్ర లో చూసిన జగన్ చలించి పోయి ప్రతి పిల్లవానికి నాణ్యమైన ఉచిత విద్యన అందించాలని కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు.
అందులో భాగంగానే నేడు విద్య రంగం లో చేపడుతున్న సంస్కరణలన్నీ ఉన్నాయన్నారు. ఈ సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలలో నమోదు పెరిగిందని అన్నారు. కుటుంబం ఆర్ధికంగా బాగుంటేనే పిల్లల చదువు బాగుంటుందని తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతోందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా పధకాలను అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదే నన్నారు.