అభం శుభం తెలియని చిన్నారులు అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో బాబాయి వరుస అయిన కాటూరి శ్రీనివాసరావు అనే సైకో చెక్క కర్రలతో ఇంటిలో తలుపులు వేసి దారుణంగా హత్య చేసిన సంఘటన సోమవారం గుంటూరుజిల్లా రేపల్లె పట్టణంలో సంచలనం కలిగించింది.
రేపల్లె పట్టణ సీఐ సూర్యనారాయణ కథనం ప్రకారం పట్టణంలోని 23వ వార్డులో నివాసం ఉంటున్న అమ్మమ్మ వద్దకు చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన కొండేటి కోటేశ్వరరావు ఉమాదేవి దంపతుల ఇద్దరు కుమారులైన పార్థివ్ సాహసవత్ (10), రోహిత్ తశ్విన్ (8), అనే ఇద్దరు పిల్లలను ఉమాదేవి చెల్లెలి భర్త అయిన కాటూరి శ్రీనివాసరావు అతి దారుణంగా హత్య చేశాడు.
కొండేటి కోటేశ్వరరావు ఉమాదేవి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ లాక్ డౌన్ కారణంగా తమ పిల్లలను రేపల్లె 23వ వార్డులో నివాసం ఉంటున్న అమ్మమ్మ మోర్ల విజయలక్ష్మి వద్ద తల్లి ఉమాదేవితో కలిసి ఉంటున్నారు.
హత్య చేసిన వ్యక్తి కర్లపాలెం గ్రామానికి చెందిన కాటూరి శ్రీనివాసరావు తనంతట తానే పోలీసులు ఎదుట లొంగిపోయాడు. హత్య చేసిన వ్యక్తికి చాలాకాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మందులు వాడుతున్నట్లు విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.
హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హృదయవిదారకమైన ఈ సంఘటన రేపల్లె పట్టణంలో నలుదిక్కుల వ్యాపించడంతో ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న హత్యగావించబడ్డ చిన్నారులను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు.
రేపల్లె పట్టణంలో మొదటిసారిగా చిన్నారులను అతి దారుణంగా చంపడం ఇదే ప్రథమం కావడంతో ఈ విషయంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.