పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్కు శుక్రవారం మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పవన్ కె వర్మ ఈరోజు రాజీనామా చేశారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి రాసిన రాజీనామా లేఖలో వర్మ దానిని ఆమోదించాలని కోరారు. అయితే తన రాజీనామాకు గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
రాజీనామా విషయాన్ని ట్వీట్లో తెలియజేశారు. మమతా బెనర్జీకి రాసిన లేఖలో ‘నా రాజీనామాను ఆమోదించండి. ఇంతకాలం ఆదరించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’ అని ఆయన అన్నారు. పవన్ వర్మ గత ఏడాది తృణమూల్ కాంగ్రెస్లో చేరారు.
ఆయన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. గతంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహాదారుగా ఉన్నారు. జూన్ 2014 నుండి జూలై 2016 వరకు రాజ్యసభ సభ్యుడుగా, JDU జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి మద్దతు ఇవ్వాలన్న జెడి(యు) నిర్ణయానికి నిరసనగా ఆయన పార్టీని వీడారు. వర్మ అనేక దేశాలకు భారత రాయబారిగా మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధిగా పనిచేయడమే కాకుండా అనేక పుస్తకాలను రచించారు.