ఒక యూట్యూబర్ పై దాడి కేసులో అరెస్టు చేయకుండా తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరిన ముగ్గురు మహిళల వినతిని న్యాయస్థానం త్రోసిపుచ్చింది.
దివ్య సేన, శ్రీలక్ష్మి, భాగ్య లక్ష్మి అనే ముగ్గురు డబ్బింగ్ ఆర్టిస్టులపై విజయ్ పి నాయర్ అనే యూట్యూబర్ అభ్యంతరకమైన వీడియో రూపొందించి విడుదల చేశాడు.
దీనితో ఆగ్ర హించిన ఆ ముగ్గురు మహిళలు నాయర్ ఇంటిపై దాడి చేసి అతడిపై శారీరకదాడి చేశారు. అతని మొహంపై నల్లటి సిరాను చల్లారు. ఇదంతా తమ ఫేస్ బుక్ లైవ్ ద్వారా ప్రసారం చేశారు.
తమపై అభ్యంతరకరమైన అశ్లీల వీడియో రూపొందించడంతో ఆగ్రహించి ఆ విధంగా చేశామని వారు పేర్కొన్నారు. తనపై జరిగిన దాడిని నాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన ల్యాప్ టాప్ ను వారు ఎత్తుకెళ్లారని, తన ఇంటిలోకి అక్రమంగా జొరబడి తనపై హత్యాయత్నం చేశారని నాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ముగ్గురు మహిళలు తిరువనంతపురం అదనపు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.
అయితే ఎంత ఆగ్రహం ఉన్నా చట్ట ప్రకారం నడచుకోవాలి తప్ప ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
నాయర్ పై దాడి చేయడం, అతడి ఇంట్లోకి జొరబడి ల్యాప్ టాప్ ను తస్కరించడం నేరాలుగానే భావించాల్సి వస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
తాము ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనందునే తాము దాడి చేయాల్సి వచ్చిందని వారు చేసిన వాదన చట్టం ముందు నిలబడదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
నాయర్ పై అశ్లీల వీడియో ప్రచారం చేసినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు, ముగ్గురు మహిళలపై కూడా దాడి కేసు బుక్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.