అప్పటి వరకు పొలం పనులు చేసుకుంటున్న యువతి ఒక్కసారిగా పిడుగు పాటుతో మృతి చెందిన సంఘటన సాటి గ్రామస్తులను కలచివేసింది. హృదయ విదారకమైన ఈ సంఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ తండా గ్రామంలో జరిగింది.
ఈ రోజు మధ్యాహ్నం నుండి నిర్మల్ జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఉదయం కాస్త ఎండగా ఉండటంతో దిలావర్పూర్ మండలం కాల్వ తాండాకు చెందిన మేగావత్ కవిత (35) ఎప్పటిలాగే తన చేనులోకి పొలం పనుల కోసం వెళ్లింది.
సాటి వ్యవసాయదారులతో మహిళలతో నవ్వుతూ తుళ్లుతూ చేనులో పని చేసుకుంటుంది. పొలంలో పనులు చేసుకుంటున్న కవిత ఒక్కసారిగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది.
అప్పటి వరకూ తమతో సంతోషంగా గడిపిన కవిత అనుకోకుండా మృతి చెందడంతో సాటి మహిళలు మనసు కలచివేసింది. అందరితో కలుపుగోలుగా ఉండే కవిత ప్రమాదవశాత్తు మృతి చెందడంతో గ్రామం శోకసముద్రంలా మారింది.
దిలావర్ పూర్ SI సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు జరిపి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.