నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో తైబజార్ గుత్తే దారులు రెచ్చిపోతూ దౌర్జన్యంగా రౌడీయిజం చేస్తూ బలవంతంగా తైబజార్ రుసుమును వసూలు చేస్తున్నారు. కల్వకుర్తి పట్టణంలో 2022 -23 సంవత్సరానికి వేలంపాటలో వేలాన్ని దక్కించుకున్న తైబజార్ గుత్తే దారులు గూడ్స్ వాహనాలలో ఎగుమతులు దిగుమతులు చేసుకునే వారిపై దౌర్జన్యంగా రౌడీయిజం చేస్తూ బలవంతపు వసూళ్లు చేయడమే కాకుండా ప్రశ్నించే వారి సామాగ్రిని కూడా ఎత్తుకు వెళ్తున్నారు.
అంతేగాక తీసుకునే రుసుముకు ఇచ్చే రసీదుకు పొంతన లేకుండా పోయింది. తీసుకునే రూపాయలు 100 అయితే ఇచ్చే రసీదు 50 రూపాయలకే ఇస్తున్నారని, అదేవిధంగా తై బజార్ వసూలు చేయకూడని లారీకి 300 రూపాయలు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని, రోడ్డుపై అమ్ముకునే వారికి తీసుకోవాల్సిన రుసుము కంటే అధికంగా వసూలు చేస్తున్నారని మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ అధికారులకు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. మేము వేలంపాటలో 22 లక్షలకు పాడుకున్నామని అవన్నీ ఎవరిస్తారని దురుసుగా ప్రవర్తిస్తూ దురుసుగా మాట్లాడుతున్నారని, వాహనాలకు సైతం అడ్డంగా నిలబడి దౌర్జన్యాలకు దిగుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
గూడ్స్ వెహికల్స్ కు ఎగుమతులు దిగుమతులు చేసే సమయంలో రుసుమును వసూలు చేయాలని ఏ చట్టం చెప్పలేదని మున్సిపల్ అధికారులు కూడా బజార్ షెడ్యూల్ వసూలు చేసుకునే ఫీజును సైతం విడుదల చేసిన వీరి ఆగడాలు అడ్డు అదుపు లేకుండా పోతుందని, వీరి దౌర్జన్యాలకు అధికారులు కళ్లెం వేయాలని అక్రమంగా వసూలు చేసే వారిపై రౌడీషీటర్ గా పేరు నమోదు చేయాలని ఓ సామాజిక కార్యకర్త తగు ఆధారాలతో పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇప్పటికైనా తై బజార్ గుత్తేదారులు పై మున్సిపల్ అధికారులు గట్టి చర్యలు తీసుకొని అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి పట్టణవాసులకు రక్షణ కల్పించడమే కాకుండా ఇతర గ్రామాల నుండి వచ్చేవారికి వారి వస్తువులకు రక్షణ కల్పించాలని మున్సిపల్ అధికారులను పోలీస్ అధికారులను పట్టణవాసులు కోరుతున్నారు.