గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 11వ వార్డుకు చెందిన వలంటీర్ వితంతు పింఛన్ లో కూడా వాటాలు తీసుకుంటున్నాడు. ఈ మేరకు మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసరావుకు సదరు మహిళ ఫిర్యాదు చేసింది.
11వ వార్డులోని వితంతు మహిళ చల్లా సామ్రాజ్యంకు ప్రతి నెల మొదటి తారీఖున ప్రభుత్వం ఇచ్చే ఫించన్ రూ. 2,250లను వాలంటీర్ గత నెల నుండి ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారు. కానీ ఈ నెల రూ. 1250 మాత్రమే ఇచ్చాడని అదేమని అడిగితే నీకు అంతే వచ్చాయని సమాధానం ఇచ్చాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో ఆమె కమిషనర్ శ్రీనివాసరావుకు ఆ వాలంటీర్ పై ఫిర్యాదు చేసింది. తనకు రావాల్సిన రూ.1000లను వెంటనే ఇప్పించి, ఆ వాలంటీర్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.