ఏటూరునాగారం రేంజ్ లో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించిన మరునాడే ఘోరం జరిగింది. ములుగు జిల్లా వాజేడు మండలం లో చిరుత పులి దాడిలో లేగదూడ మృతి చెందింది. చిరుతపులి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ ఆనవాలు గుర్తించినట్లు సత్యం న్యూస్ వెల్లడించిన విషయం తెలిసిందే.
చిరుత పులి పగ్ మార్కులను సేకరించిన అటవీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల-దూలపురం గ్రామంలో గత నెల (ఫిబ్రవరి) 22 న చిరుతపులి చెట్టుపై కనిపించింది.
అప్పటి నుంచి అటవి ప్రాంత సమీపంలోని గ్రామాలలో చిరుతపులి సంచరిస్తున్నట్లు అనుమానం ఉంది. తాజాగా చిరుతపులి దాడి లో లేగ దూడ మృతి చెందడంతో అటవీ ప్రాంతానికి దగ్గర లో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొంగల, దూలపూరం, సుందరయ్య కాలనీ, ఇప్పాగూడెం, గుమ్మడి దోడి గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కె. మహేందర్, సత్యం న్యూస్