రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. మొదట బాలాలయాన్ని సందర్శించి లక్ష్మీనరసింహ స్వామికి పూజలు చేసిన తర్వాత స్వామివారి కళ్యాణానికి పట్టువస్త్రాలు, తంబ్రాలు సమర్పించారు.
వేద మంత్రాల మధ్య దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు, కార్య నిర్వహణాధికారి స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల వద్ద పట్టువస్త్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులకు వేద ఆశీర్వచనాలు పలికారు. ఆ తర్వాత స్వామి వారి తీర్ధప్రసాదాలను అందజేశారు.
యాదాద్రి ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడానికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దంపతులు కేజీ బంగారాన్ని విరాళంగా అందజేశారు. మరో కేజీ బంగారాన్ని మంత్రి కుటుంబ సభ్యులు, నిర్మల్ నియోజకవర్గ ప్రజలు విరాళంగా అందజేశారు. అనంతరం.. యాదాద్రి పునర్నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై ఆరా తీశారు. ప్రధాన ఆలయ మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.