తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాల విస్తరణలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాత, కొత్తల కలయికతో రాష్ట్ర నూతన కార్యదర్శులు , సంయుక్త కార్యదర్శులను నియమించింది.
కరోనా సమయంలో తనదైన ప్రత్యేక నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన `సాఫ్ట్ వేర్ శారద`కు రాష్ట్ర నాయకత్వంలో స్థానం కల్పించింది. ఈ దఫా వినూత్నంగా జోన్ల వారీగా ఇంచార్జీ కార్యదర్శుల నియామకం చేశారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీటా ఆఫీస్ స్పేస్ కేటాయింపు జరగనుండటంతో పాటుగా సహా క్షేత్రస్థాయిలో కార్యక్రమాల విస్తరణ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు సాంకేతికత యొక్క ఫలాలను మరింత మెరుగ్గా అందుకోగలిగేందుకు టీటాకు జిల్లా కలెక్టరేట్లు లేదా జిల్లా కేంద్రాల్లో వర్కింగ్ స్పేస్ కేటాయించాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కలెక్టర్లకు ఇటీవలే లేఖ రాసిన సంగతి తెలిసిందే. టీటా ఏర్పాటు చేసే ఈ కేంద్రాల వల్ల ప్రపంచవ్యాప్తంగా టీటా కలిగి ఉన్న 30 చాప్టర్ల యొక్క సభ్యుల రూపంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు పెట్టుబడులు వచ్చే అవకాశం , ఎన్నారైలు స్టార్టప్లు ఏర్పాటు చేసేందుకు టీటా సమన్వయం చేసేందుకు ఈ వర్క్ స్పేస్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జిల్లాల్లో ఆఫీస్ స్పేస్ రావడం , టీటా కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో విస్తరించనున్ననేపథ్యంలో బాధ్యతలు పెరిగాయి. దీంతో రాష్ట్ర నాయకత్వం సభ్యుల సంఖ్య పెరిగింది. దీనికి తోడుగా జోన్ల వారీ బాధ్యతలతో రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం సైతం టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల చేపట్టారు.
క్షేత్రస్థాయిలో టీటా కార్యక్రమాలు సమన్వయం
క్షేత్రస్థాయిలో టీటా కార్యక్రమాలు సమన్వయం చేసేందుకు పాత- కొత్త , స్త్రీ-పురుష నాయకత్వం కూర్పుతో నూతనంగా రాష్ట్ర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల నియామకం చేపట్టారు. దీంతోపాటుగా ఈ దఫా అన్ని జిల్లాలు కవర్ అయ్యే విధంగా జోన్ల వారీగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శులకు ఇంచార్జీ బాధ్యతలు అప్పగించారు. మెజార్టీ సభ్యులు పాత కమిటీలో ఉండగా సాఫ్ట్ వేర్ శారద (శారద ఉందాడి)కు రాష్ట్ర నాయకత్వంలో స్థానం కల్పించారు.
కోవిడ్ సమయంలో ఉద్యోగం పోయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా తన తండ్రి కూరగాయల వ్యాపారంలో ఆమె సహకరించారు. ఉద్యోగం కల్పిస్తామని పలువురు ప్రతిపాదించినప్పటికీ స్వయం ఉపాధి చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు. టీటా ద్వారా ఉచితంగా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లాస్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పట్టభద్రురాలు అయ్యారు. తాజాగా తనకు ఈ బాధ్యతలు కల్పించిన సందర్భంగా టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల సహా నాయకత్వానికి సాఫ్ట్ వేర్ శారద కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర నూతన కార్యదర్శులుగా శ్రీలత చింతల , జ్ఞానకర్ రెడ్డి , వెంకట వనం , దీపికజోషి నియమితులు అయ్యారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా హరికా మోటర్, శారద ఉందాడి, ఎం. శివశంకర్, దుర్గా శంకర్ లకు అవకాశం కల్పించారు. జోన్ల వారీ బాధ్యతలతో రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నలుగురు నియమితులు అయ్యారు. సౌత్ జోన్ బాధ్యతలను రాజేంద్రప్రసాద్ సాగర్కు అప్పగించారు.
ఆయ పరిధిలోకి మహబూబ్నగర్ , గద్వాల్, వనపర్తి , నాగర్ కర్నూల్, నారాయణపేట్, నల్లగొండ , యాదాద్రి , సూర్యపేట్ జిల్లాలు వస్తాయి. ఈస్ట్ జోన్ ఇంచార్జీగా బొచ్చు ధర్మేందర్ ఎంపికయ్యారు. భద్రాద్రి , ములుగు, మహబూబాబాద్ , ఖమ్మం, భూపాలపల్లి, వరంగల్ రూరల్ ,వరంగల్ అర్బన్ , జనగాం, సిద్ధిపేట జిల్లాలు ఆయన పరిధిలోకి వస్తాయి. వెస్ట్ జోన్ ఇంచార్జీగా శేరి రాజేందర్ రెడ్డికి బాధ్యతలు కల్పించారు. ఆయన పరిధిలోకి వికారాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ , హైదరాబాద్ , సంగారెడ్డి, మెదక్ , కామారెడ్డి, సిరిసిల్లా జిల్లాలు వస్తున్నాయి. నార్త్ జోన్ ఇంచార్జీగా విష్ణు చిక్కులపల్లి నియమితులు అయ్యారు. ఆదిలాబాద్, కొమురం భీం , నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్ , మంచిర్యాల్ , పెద్దపల్లి , కరీంనగర్ జిల్లాలు ఆయన పరిధిలోకి వస్తాయి.
రాష్ట్ర నూతన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల నియామకం సందర్భంగా టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల మాట్లాడుతూ పాత, కొత్త కలయికగా నూతన కమిటీ ఉందని తెలిపారు. కష్టకాలంలో ఎలా ముందుకు సాగవచ్చో తన ప్రత్యేకతతో తెలియజేసిన సాఫ్ట్ వేర్ శారదకు సైతం రాష్ట్ర నాయకత్వంలో అవకాశం కల్పించామని వివరించారు.
రాష్ట్ర నూతన కార్యదర్శులు, జోన్ల వారీ బాధ్యతలు కలిగి ఉన్న సంయుక్త కార్యదర్శులు జిల్లాల్లో ఆఫీస్ స్పేస్ సంబంధిత వ్యవహారాలను సమన్వయం చేయనున్నారని సందీప్ మక్తాల వెల్లడించారు. దీంతో పాటుగా ఆయా జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఎన్నారైలను సహాయ సహకారాలు అందించడం, స్టార్టప్ల ఏర్పాటు , టీటా నిర్వహించే కార్యక్రమాలను ముందుకు తీసుకుపోనున్నట్లు వివరించారు.