తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నగరంలోని ప్రజలందరికీ కుల మతాలకు అతీతంగా ఓ పండుగ లాంటిదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించేలా టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
1130 వ సంవత్సరం ఫిబ్రవరి 24న ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. “తిరుపతి పుట్టినరోజు” పండుగ ఉత్సవాలను మొట్టమొదటిసారి శ్రీవారి పాదాల చెంత డిఎంసి భాస్కర్, హేమంత్ యాదవ్, చొడం మధు ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద జరిగిందని ఆయన తెలిపారు.
శ్రీ ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు నడయాడిన కుగ్రామం నేడు తిరుపతి మహానగరంగా రూపాంతరం చెంది ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహమని ఆయన అన్నారు. గోవిందరాజస్వామి ఆలయ నిర్మాణం తో తిరుపతి నగర మొదలైంది ఆ తర్వాత ఆలయం చుట్టూ నివాసాల నిర్మాణం జరిగి ఏర్పడిన అగ్రహారం తర్వాత ఊరుగా మారిందని ఆయన వివరించారు.
శ్రీ రామానుజాచార్యుల వారే “తిరుపతి” అనే నామకరణం చేశారని చరిత్ర చెబుతోందని నవీన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి నగర చరిత్ర భవిష్యత్ తరాల వారికి తెలిసేలా టిటిడి ఆధ్వర్యంలో ఓ మ్యూజియం ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.