ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల ఫీజులు తగ్గించాలని ఏలూరు జిల్లా TNSF అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు DEO RS గంగా భవాని కి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా TNSF అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా లో ఉన్న కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల దగ్గరనుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయిని అన్నారు.
కార్పోరేట్ మరియు ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు స్ట్రక్చర్ ను నోటీసు బోర్డులో అతికించి అందరికి తెలియజేసే విధంగా ఉండవలెనని నిబంధనలు చెబుతున్నప్పటికీ నిబంధనలను పాటించడం లేదని ఆయన తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణలోనే అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్ముతున్నారని ఆయన తెలిపారు. జిల్లా పరిధిలో గుర్తింపులేని ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల రవాణా కోసం వినియోగిస్తున్న ఫిట్మెంట్ లేని స్కూల్ బస్సుల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అందువల్ల వాటిని తక్షణమే నిలిపివేయాలని ఆయన తెలిపారు.
ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నడుపుతూ క్రొత్త అడ్మిషన్లను తీసుకొని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ మరియు కార్పొరేట్ కళాశాలలో 25% సీట్లను ఎస్సీ, ఎస్టీ ,బిసి ,మైనారిటీ మరియు అగ్రవర్ణ పేదలకు కేటాయించాలని మహేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ అధ్యక్షుడు వేగి సిధు, జంగారెడ్డిగూడెం టౌన్ జనరల్ సెక్రటరీ పవన్,వైస్ ప్రెసిడెంట్ జగత్, దుసారి మహేష్, నెరుసు సాయి రామ్,జయంత్,కిషోర్, తదితరులు పాల్గొన్నారు.