కోడి పందాల కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. సంక్రాంతి సందర్భంగా గ్రామానికి సమీపంలోని పామాయిల్ తోటల్లో కోడిపందేలు నిర్వహించారు. కోళ్ల కాళ్లకు కత్తులు కడుతుండగా సరిపల్లి వెంకటేశ్వరరావు (55) అనే వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు.
ఈ క్రమంలో ఓ కోడిపుంజు ఒక్కసారిగా కాళ్లు విదిలించడంతో పక్కనే ఉన్న వెంకటేశ్వరరావు తొడభాగంలో కత్తి గుచ్చుకుంది. దీంతో బాగా రక్తస్రావం జరగడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. అక్కడ ఉన్నవారు వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావును పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు.