రాష్ట్ర పోలీస్ ట్రైనింగ్ అదనపు డీజీ సంజయ్…ఒక్క పర్యటన నిమిత్తం విజయనగరం జిల్లాకు వచ్చారు. వచ్చీరాగానే మహిళా సంరక్షణ పోలీసులకు సంబంధించి త్వరలో శిక్షణ,పరీక్ష నిర్వహించబోతున్న తరుణంలో నగరంలో పలు కేంద్రాలను అదనపు డీజీ సంజయ్ పరిశీలించారు.ఇందులో భాగంగా ఎస్పీ దీపికా ఎం పాటిల్ తో చింతవలస ఏపీఎఎస్పీ బెటాలియన్,లెండీ కాలేజ్, పోలీస్ ట్రైనింగ్ కళాశాలను పరిశీలించారు.ఇక శిక్షణకు అవసరమైన మౌలిక వసతులను పరిశీలించారు.. అదే విధంగా మహిళా సంరక్షణ పోలీసులకు పరీక్ష నిర్వహించేందుకు లెండీ ఇంజనీరింగు కాలేజ్ లోని కంప్యూటరు లేబ్ ను సందర్శించి, కంప్యూటర్ల లభ్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం, జిల్లా పోలీసు కార్యాలయంకు చేరుకొని మహిళా పోలీసులతో అదనపు డిజి సమావేశమై, పరీక్షకు వారు సిద్ధమవుతున్న తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా సంరక్షణ పోలీసుల సందేహాలను అదనపు డీజీ నివృత్తి చేసారు. మహిళా సంరక్షక పోలీసులుగా ప్రజలు గుర్తించేందుకు మాత్రమే పోలీసు యూనిఫారం ఉంటుందని, వారు ప్రతీ రోజు యూనిఫారం ధరించాల్సిన అవసరం లేదన్నారు.
మహిళా పోలీసులు సచివాలయంలోనే విధులు నిర్వహిస్తూ, వారి పరిధిలోని మహిళల రక్షణ, భద్రతకు చర్యలు చేపడతారన్నారు. మహిళా పోలీసులకు రాత్రి విధులు, బందోబస్తు విధులు ఉండవని స్పష్టం చేసారు. అత్యవసర సమయాల్లో మినహా మహిళా పోలీసులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధంగానే విధులు ఉంటాయన్నారు. పోలీసుశాఖలో ఇతర మహిళా ఉద్యోగులను గౌరవించే విధంగానే మహిళా పోలీసులను కూడా గౌరవిస్తామన్నారు.
పోలీసుశాఖలో అంతర్భాగంగా మహిళా పోలీసులను ప్రభుత్వం గుర్తించినందున, వారి ప్రొబేషన్ డిక్లేర్ చేసేందుకు త్వరలో పరీక్షను, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తా మన్నారు. . అదనపు డీజీ వెంట 5వ బెటాలియన్ కమాండెంట్ విక్రాంత్ పాటిల్, పిటిసి ప్రిన్సిపాల్ రామచంద్రరాజు, అడిషనల్ ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఒఎడి ఎన్.సూర్యచంద్రరావు, విజయనగరం డిఎస్పీ పి.అనిల్ కుమార్, పీటీసీ డిఎస్పీలు హస్మా ఫరీన్, వివి అప్పారావు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.