అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం సీలేరు ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కొంతమంది ఉపాధ్యాయులు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అంటూ విద్యార్థినులు స్థానిక ఎస్ఐ, గ్రామ పెద్దలు, పాత్రికేయుల ఎదుట బోరున విలపించారు.
సీలేరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మూడవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు 320 మంది కి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరికి విద్యాబోధన చేయడానికి మహిళా ఉపాధ్యాయులతో పాటు 5 మంది పురుష ఉపాధ్యాయులు కూడా ఉన్నారు.
వీరంతా 25 నుంచి 40 లోపు వారే. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సక్రమంగా మెనూ అమలు జరగడం లేదన్న విద్యార్థుల ఫిర్యాదుతో స్థానిక సర్పంచ్ ఎస్ ఐ గ్రామ పెద్దలు పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా మెను సమస్యతోపాటు కొంతమంది ఉపాధ్యాయులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ కొంతమంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లిన గ్రామ పెద్దలు స్థానిక ఎస్ఐ ఎదుట బోరున విలపిస్తూ ఆవేదన చెందారు.
రాత్రి సమయంలో గేటుకు తాళాలు వేయకపోవడంతో బయట వ్యక్తులు కూడా వచ్చి తమను వేధిస్తున్నారంటూ విద్యార్థులు ఆవేదన చెందారు. గతంలో పాఠశాల విజిట్ కి వచ్చిన ఐ టి డి ఎ పి ఓ ఈ పాఠశాలలో యుక్తవయసులో ఉన్న ఉపాధ్యాయులను ఎందుకు నియమించారు అంటూ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ని ప్రశ్నించారు.
తక్షణమే ఉపాధ్యాయులను మార్చాలని ఆదేశాలు అయితే జారీ చేశారు గానీ చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాలలో యుక్తవయసులో ఉన్న పురుష ఉపాధ్యాయులను మార్చకపోతే అమాయకులైన గిరిజన విద్యార్థినులు కీచక గురువుల చర్యలకు బలి పశువులు కాక తప్పదు.