ఆదిలాబాదు ఉమ్మడి జిల్లా చరిత్రలోనే మొదటి సారి దళిత నాయకులు డీసీసీబీ పదవి చేపట్టిన ఘనత నాందేవ్ కాంబ్లే కె దక్కిందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన డీసీసీబీ చైర్మన్ స్వర్గీయ కాంబ్లే నాందేవ్ సంతాప సభకు జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా కాంబ్లే నాందేవ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంబ్లే ఆత్మ శాంతి కోసం 2 నిముషాలపాటు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ కాంబ్లే నాందేవ్ మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని అన్నారు. నాందేవ్ మరణాన్ని మనమే జీర్ణించుకోలేక పోతున్నామని, అలాంటి వారి కుటుంబ సభ్యుల మనోవేదన అంతాఇంతా కాదన్నారు. మొదటగా వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు.
పదవులు, డబ్బులు ఎన్ని ఉన్నా చివరకు మంచి తనమే మిగిలి ఉంటుందని అది నాందేవ్ విషయంలో రుజువైందన్నారు. నాందేవ్ వారి సమాజం పట్ల చూపించిన ప్రేమను గుర్తు చేశారు. ఆయన సమాజానికి తాము ఎప్పుడూ అండగా ఉండి, నాందేవ్ ఆశయసాధనలో ముందుంటామని తెలియజేశారు. విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్ గా ఉండి వెలుగుల విలువ తెలిసిన వ్యక్తిగా నాందేవ్ వారి సమాజంలో వెలుగులు నింపే అనేక కార్యక్రమాలు చేపట్టారని తన సమాజానికి ఎనలేని సేవలు చేసేవారని గుర్తు చేసుకున్నారు.
సీఎం కేసీఆర్ అతనిపై ప్రత్యేక దృష్టి ఉంచి ఛైర్మెన్ గా నియమించారన్నారు. అదిలాబాదు చరిత్రలోనే దళిత బిడ్డ డిసిసిబి చైర్మన్ గా ఎన్నుకోవడం దానికి నాందేవ్ గారే మొదటి వ్యక్తి కావడం అదిలాబాద్ చరిత్రలో గుర్తుండిపోతుందన్నారు.
ఈనెల 7వ తేదీన నాందేవ్ సొంత గ్రామమైన గుంజాలలో నిర్వహించే సంతాప సభకు ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త జిల్లా, నియోజకవర్గ ప్రజలు హాజరు కావాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ రౌతు మనోహర్, మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాదు, రైతు బంధు సమితి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి. యూనిస్ అక్బని, సాజిత్ ఖన్, తో తదితరులు పాల్గొన్నారు.