తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జి వరుపుల రాజా ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన సంతాపం వ్యక్తం చేశారు. రాజా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఆదివారం హైదరాబాద్ నుండి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామం చేరుకుని రాజా భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను, పార్టీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే గుండె పోటుతో అకస్మాత్తుగా మృతి చెందడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని పార్టీ బలోపేతానికి వరుపుల రాజా చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. వరుపుల రాజా కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెదేపా నాయకులు వరుపుల రాజా గుండె పోటుకు గురై కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు. పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాల్లో విస్తరించి ఉన్న అరకు పార్లమెంటు పరిధిలోని సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల పరిశీలకునిగా తెలుగుదేశం పార్టీ తరఫున నియమితులై, సాలూరు నియోజకవర్గ ఇంచార్జి గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే బంజు దేవ్ లతో కలిసి మండల కేంద్రం సాలూరులో ఎన్నికల ప్రచారం శనివారం పూర్తి చేసుకుని సాయంత్రం 6గంటలకు స్వగ్రామం చేరుకున్న ఆయన తన సమీప బంధువుతో మాట్లాడుతుండగా ఒక్క సారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే శంఖవరం లోని పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వత సురేష్ కు సమాచారం అందించారు. వెంటనే కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా హృదయ స్పందన శాశ్వతంగా ఆగిపోయింది. కడపటి ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో రాజా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం వెంటనే నారా లోకేష్ కు తెలిపినా, చంద్రబాబు అందుబాటులో లేని కారణంగా ఉదయం ఆయనకు పార్టీ శ్రేణులు తెలిపాయి. దిగ్భ్రాంతికి గురైన చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం ప్రత్తిపాడు చేరుకుని రాజా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. రాజా అంతిమ యాత్ర క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. చంద్రబాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, రాజా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
వరుపుల రాజా 1976 ఆగస్టు 14న పెదశంకర్లపూడిలో జన్మించారు. అసలు పేరు జోగిరాజు. తాత వరుపుల జోగిరాజు ఒకసారి, చిన్న తాత వరుపుల సుబ్బారావు రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. భార్య సత్యప్రభ, పిల్లలు మాధురి, తర్షిత్.2066లో పెదశంకర్లపూడి ఎంపీటీసీ సభ్యులుగా,2009వరకు ఎంపీపీ గా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వైకాపా యువజన అధ్యక్షునిగా పనిచేశారు.2011లో సొసైటీ అధ్యక్షుడు నుండి డీసీసీబీ చైర్మన్ గా,2014లో తెదేపా లో చేరి ఆప్కాబ్ వైస్ ఛైర్మన్ గా పనిచేశారు.2019లో తెదేపా టిక్కెట్ సాధించి ప్రత్తిపాడు నుండి పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయారు.