కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డులోని శ్రీరామ్ నగర్ కాలనీ చెందిన 50 మంది మైనారిటీ మహిళలు, మాచారెడ్డి మండలానికి చెందిన యువకులు కామారెడ్డి నియోజకవర్గ వైఎస్ఆర్టిపి ఇంచార్జ్ నీలం రమేష్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నీలం రమేష్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్సార్ కు దక్కిందని తెలిపారు.
గతంలో తాము వైఎస్సార్ వెంట ఉన్నామని, ఇప్పుడు వైఎస్సార్ తనయ షర్మిలకు అండగా ఉండేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైఎస్సార్ పథకాలు మళ్ళీ తెలంగాణలో అమలు కావాలంటే వైఎస్ షర్మిలతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు షర్మిల నాయకత్వం వైపు మహిళలు ఆకర్షితులై వస్తున్నారని వెల్లడించారు. వివిధ వర్గాల ప్రజలు, యువకులు, మహిళలు వైఎస్ఆర్టిపి వైపు చూస్తున్నారని తెలిపారు.
కాలేశ్వరం నీళ్లు కామారెడ్డికి ఎప్పుడు వస్తాయని ప్రశ్నించారు. నిధులు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధి చేయడంలో లేదన్నారు. ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టిస్తున్న బిఆర్ఎస్ నేతలకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు తాహెర్, సుధాకర్, మహిళా నేత అస్మా, స్వామీ తదితరులు పాల్గొన్నారు.