మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలను టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి కిషన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిధిగా పాల్గొని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులే పార్టీని గెలిపిస్తాయని, కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఇరవైకి ఇరవై స్థానాలు గెలుస్తుందని పేర్కొన్నారు. పక్కనే కృష్ణ నది ప్రవహిస్తున్న కొల్లాపూర్ ప్రజల నీటి అవసరాలను తీర్చలేని గత ప్రభుత్వాలు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కెఎలై ద్వారా సాగు, తాగు నీటి అవసరాలను తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కిందని అన్నారు.
కొల్లాపూర్ ప్రాంతాన్ని కోనసీమగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పార్టీ బి ఫారం ఎవరికి ఇస్తే వారే TRS అభ్యర్థులను గెలిపించాలన్నారు. కొల్లాపూర్ అభివృద్ధి కోసం అందరూ సహకరించాలన్నారు. పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు అందరూ నడుచుకోవాలని అన్నారు.
కొల్లాపూర్ టిఆర్ఎస్ పార్టీలో వర్గాలు ఏమిలేవని, అంతా కలిసి ఒకటిగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోడేర్ మండల నాయకులు ధూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి ఛైర్మన్ కాటం జంబులయ్య, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి టిఆర్ఎస్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.