రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రం లోని ఎన్టీఆర్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ధర్నాలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనాలి అంటూ వరి నారుతో నినాదాలు చేశారు. యాసంగి వరిని కొంటారా .. కొనరా.. అంటూ ధర్నాలో నినాదాలు హోరెత్తాయి.
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతులు పండించిన వరి ధ్యాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనదని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇంత కక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు. రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ వైఖరి కి వ్యతిరేకంగా పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. రైతులను వంచిస్తున్న రాష్ట్ర బిజేపీ నాయకుల వైఖరిని ఎండగడదామని భీరం అన్నారు.