తిరుమలలోని టిటిడి చైర్మన్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా చేరి నెల తిరగక ముందే అకారణంగా తిరుపతికి బదిలీ అయిన ఉమా శంకర్ రెడ్డి ఆత్మహత్య దురదృష్టకరమని జనసేన పార్టీ నాయకులు రాజా రెడ్డి అన్నారు. గతంలో తిరుమల జే ఈ ఓ ఆఫీస్ లో పనిచేసిన ఉద్యోగి సురేష్ ఆత్మహత్య, ఇప్పుడు ఉమా శంకర్ రెడ్డి ఆత్మహత్యకు తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈవో ధర్మారెడ్డి కారణమని ఆయన ఆరోపించారు.
దేవస్థానం ఉద్యోగులు అందరూ కూడా ఇదే విషయం చెబుతున్నారని ఆయన అన్నారు. అంతే కాకుండా అసలు ఆత్మహత్య చేసుకున్న ఉమాశంకర్ రెడ్డి సూసైడ్ నోట్ ఎలా మాయమైంది, అత్యవసరం గా నిమిషాల వ్యవధిలో పోస్టుమార్టం, వెనువెంటనే దహన క్రియలు ఎందుకు చేశారు అనే వాటిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. కాబట్టి ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులు ఎంతటివారైనా కూడా కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ నాయకులు రాజా రెడ్డి డిమాండ్ చేశారు. జనసేన పార్టీ నాయకులు పసుపులేటి సురేష్ మాట్లాడుతూ వైయస్సార్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించడమే కాకుండా ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ని కూడా అనవసరపు రాజకీయ కార్యకలాపాలతో సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు.