కామారెడ్డి మున్సిపాలిటీలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ కౌన్సిలర్లు ఆ పార్టీకి చెయ్యిచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 28 వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల రమేష్, 19 వ వార్డు కౌన్సిలర్ రవీందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కైలాస్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి సిట్టింగ్ కౌన్సిలర్లు పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. కామారెడ్డిలో పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గెలుపు కోసం కౌన్సిలర్లు క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ వంశీ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, కామారెడ్డి