మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్ వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జాతీయ రహదారి బైపాస్ వద్ద ఎదురెదురుగా వస్తున్న లారీ బైకు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. చేగుంట నుండి మకరాజుపేట వెళ్లే రహదారిలో సీసీ రోడ్డు నిర్మాణం చేస్తున్నందున వాహనాల మళ్లింపు చేపట్టారు. వాహనాల మళ్లింపు వల్లే వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.
చనిపోయిన యువకులు రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన కోళ్ల రవితేజ (23), బాలాజీ సింగ్ (32)గా ఎస్ఐ నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి మృతులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.