ఒడిశాలోని రాయగఢ్ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. భారత్ను సందర్శించేందుకు ఇక్కడికి వచ్చిన ఇద్దరు రష్యా పర్యాటకులు వారం వ్యవధిలోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. రష్యాలో అత్యధికంగా సంపాదిస్తున్న రాజకీయ నాయకుడు పావెల్ ఆంటోనోవ్ శనివారం ఒడిశాలోని ఒక హోటల్లో బస చేశాడు. అతను తన గది కిటికీ నుండి కిందపడి మరణించాడు.
దీనికి రెండు రోజుల ముందు, అంటే గురువారం, అతని స్నేహితులలో ఒకరు పార్టీ సందర్భంగా గుండెపోటుతో మరణించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పావెల్ ఆంటోనోవ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుకూల పార్టీతో సంబంధం కలిగి ఉన్నారు. అయితే ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత ఆయన పలు సందర్భాల్లో పుతిన్పై విమర్శలు గుప్పించారు.
ఆంటోనోవ్ రష్యాలోని వ్లాదిమిర్ ప్రాంతానికి చెందిన ఎంపీ. 2019లో రష్యాలో అత్యధిక పారితోషికం పొందిన రాజకీయ నాయకుడు. అతను తన 65వ పుట్టినరోజును జరుపుకోవడానికి భారతదేశానికి వచ్చారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంటోనోవ్ హోటల్ మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందాడు. 65 ఏళ్ల పావెల్ ఆంటోనోవ్ శనివారం హోటల్ వెలుపల రక్తపు మడుగులో పడి ఉన్నాడని పోలీసు అధికారి తెలిపారు.
అతని సహ-ప్రయాణికుడు వ్లాదిమిర్ బిడెనోవ్ డిసెంబర్ 22న అదే హోటల్లో చనిపోయాడు. అతను హోటల్ మొదటి అంతస్తులోని తన గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతని వద్ద కొన్ని ఖాళీ మద్యం సీసాలు ఉన్నాయి. జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వ్లాదిమిర్, పావెల్ నలుగురు సభ్యుల రష్యన్ పర్యాటకుల బృందంలో ఉన్నారు.
వారు తమ గైడ్ జితేంద్ర సింగ్తో కలిసి బుధవారం రాయ్గఢ్ నగరంలోని ఒక హోటల్లోకి వచ్చారు. పావైల్ మృతిపై సీనియర్ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ ఇది ఆత్మహత్యగా అనిపిస్తోందని తెలిపారు. తన స్నేహితుడి మరణంతో పావెల్ డిప్రెషన్లో ఉన్నాడని తెలిపారు. పావెల్ పైకప్పుపై నుంచి ప్రమాదవశాత్తూ పడిపోయి ఉండవచ్చనే కోణంతో సహా అన్ని మార్గాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.