ఎలాంటి పరిపాలనా అనుభవం లేని కొత్త మంత్రులు పొరబాట్లు చేయకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది. కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న టి.కృష్ణబాబును అక్కడ నుంచి బదిలీ చేసి వైద్య ఆరోగ్య శాఖను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను అక్కడ నుంచి బదిలీ చేసి రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది.
ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖను పర్యవేక్షిస్తారు. దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్న ఎం. హరి జవహర్ లాల్ ను అక్కడ నుంచి బదిలీ చేశారు. ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమితులైన కృష్ణబాబు ఆర్ అండ్ బి ని కూడా నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటి రెండు రోజుల్లో మరి కొందరు ఐఏఎస్ అధికారులకు కూడా స్థానచలనం కలగబోతున్నట్లు సమాచారం.