కొత్త ఆశలు, సరికొత్త ఉత్సాహం తో శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అన్ని శాఖల అధికారులు సమష్టిగా జిల్లా పురోభివృద్ధికి కృషి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుభకృత్ నామ సంవత్సర తెలుగు ఉగాది వేడుకలను జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతనజరిగిన ఈ వేడుకలకు కలెక్టర్,జిల్లా ఎస్పి కుటుంబ సభ్యులు జిల్లా అధికారులు హాజరయ్యారు.
ఈ కార్య క్రమంలో వేద పండితులు పట్నం సురేష్ శర్మ పంచాంగ పఠనం చేశారు. ఉత్తర ప్రాంతంలో అగ్నిభయం, దక్షిణాదిన సుభిక్షం ఉంటాయి. చైత్ర, వైశాఖ మాసాల్లో వస్తువుల ధరలు నిలిచి ఉంటాయి. జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో స్వల్ప వర్షం, వస్తువుల ధరలు నిలిచి ఉంటాయి. శ్రావణం, భాద్రపదంలో అధిక వర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి.
నెయ్యి, నూనె ధరలు నిలిచి ఉంటాయి. ఆశ్వయుజ, కార్తిక మాసాల్లో ధాన్యాదుల ధరలు తగ్గవచ్చు. మార్గశిరం, పుష్య మాసాల్లో అపర ధాన్యాల ధరలు అందుబాటులో ఉంటాయి, పాలకుల మధ్య కలహాలకు అవకాశం. మాఘ, ఫాల్గుణాల్లో మిశ్రమంగా ఉంటుంది. ప్రజలకు అనారోగ్యం, భయం ఉంటాయి పట్నం సురేష్ శర్మ తన పంచాంగ పఠనం లో వివరించారు.
52 మందికి ఉగాది పురస్కారాలు
జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, జిల్లా ఎస్ పి కె మనోహర్ ల కుటుంబ సభ్యులను వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది 52 మందికి మొదటిసారిగా ఉగాది పురస్కారాలను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పి కె. మనోహర్ లు జిల్లా లోని వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి నల్లమల్ల కేంద్రమైన పులి బొమ్మ ఆకృతులతో ఉన్న అందమైన జ్ఞాపికలను అందించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత 2 సంవత్సరాల నుండి కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి వేడుకలు ఘనంగా నిర్వహించకుండా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని, వాటన్నింటిని కొత్త ఈ ఏడాదిలో అధిగమించాలి అనే ఉద్దేశంతో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వర్తిస్తూ కొత్త సంవత్సరాన్ని మంగళప్రదంగా ప్రారంభిస్తున్నామని తెలిపారు.
అన్ని శాఖల అధికారులు సమైక్యంగా ఉండి అభివృద్ధి చేయగల సత్తా ఉందని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువయ్యేలా జిల్లా యంత్రాంగం కృషి చేయాలన్నారు. జిల్లా లో కొత్త పరిస్థితులు ఏర్పరచుకోవడం అందరి బాధ్యతని తెలిపారు.
అధికారులు చిత్తశుద్దితో పనిచేయూలని సూచించారు. ప్రకృతి, భగవంతుడు మన సంకల్పానికి చేయూత నివ్వాలని ప్రార్థిస్తున్నానని, అలాగే మంచిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతుల ఇళ్లు కళకళలాడాలని, యువతకు విద్యా,ఉద్యోగ అవకాశాలు మెరుగు పడాలని. వ్యవసాయ ప్రగతితో పాటు అన్ని రంగాల్లో జిల్లా సర్వతో ముఖాభివృద్ధి చెందాలని ఆయన ఆకాక్షించారు.
తక్కువ సమయంలో ఉగాది పురస్కార వేడుకలను ఘనంగా ఏర్పాట్లు చేసిన కలెక్టరేట్ ఏవో క్యాంపు కార్యాలయ సిబ్బందిని అభినందించారు. ఉగాది ఉత్తమ పురస్కారాలకు ఎంపికైన సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
జిల్లా ఎస్పీ కె మనోహర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఈ నూతన తెలుగు ఉగాది సంవత్సరం అన్ని శుభాలు కలగాలని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకలకు హాజరైన మహిళా ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ సతీమణి మహేశ్వరి సాంప్రదాయ పద్ధతుల వాయనాలను స్వయంగా అందించారు.
కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్ జిల్లా అధికారులు నర్సింగ్ రావు, రమేష్, సుధాకర్ లాల్, వెంకటలక్ష్మి అనిల్ ప్రకాష్, సీతారాం భూపాల్ రెడ్డి వెంకటేశ్వర్లు, కృష్ణ వివిధ శాఖల సిబ్బంది, కలెక్టర్ సీసీలు నారాయణ, గౌతమ్, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్