రష్యా చేస్తున్న పాశవిక దాడి కారణంగా ఉక్రెయిన్ ఆర్ధిక పరిస్థితి ఛిన్నాభిన్నమైపోయింది. ఇప్పటికే దాదాపు 45 శాతం ఆర్ధిక వ్యవస్థ పతనమైందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇది కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభంలో పతనమైన దానికంటే రెండింతలు ఎక్కువ కావడం గమనార్హం.
యుద్ధం కారణంగా ఒక్క ఉక్రెయిన్ మాత్రమే కాదు బెలారస్, కిర్గిస్థాన్, మాల్డోవా, తజకిస్థాన్లలో కూడా ఈ సారి ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. యుద్ధం చేస్తూ తన విజయగర్వాన్ని ప్రదర్శిస్తున్న రష్యా కూడా తన జిడిపిలో 10 శాతం కోల్పోయిందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. యుద్ధానికి ముందు ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి రేటు 3 శాతం ఉండొచ్చని అంచనా వేశారు.
అయితే యుద్ధం కారణంగా ఆర్ధిక వృద్ధి లేకపోగా 4.1శాతంకు తగ్గే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయని వివరించింది. ‘ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉక్రెయిన్ వాసులను ఆదుకొనేలా ప్రభుత్వం నడవాలంటే.. ఆదేశానికి తక్షణమే భారీ ఆర్థిక సాయం అవసరం’ అని ప్రపంచ బ్యాంక్ ఐరోపా, మధ్య ఆసియా ప్రాంతాలకు ఉపాధ్యక్షురాలు అన్నా బెజ్రెడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ నుండి వచ్చే గోధుమలపై ఆధారపడ్డ మధ్య ఆసియా దేశాల్లో పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉందని నివేదికలో పేర్కొంది.