ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ 100 రోజుల కార్యక్రమంలో తాను బిజీబిజీగా గడుపుతూనే మరోవైపు ప్రభుత్వ పనుల్లో వేగం పెంచే పనిలో కూడా బిజీగా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ తన గత హయాంలో కూడా ఇదే విధంగా పనిచేసినప్పటికీ ఈసారి ఆయన కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది.
అధికారులకే కాకుండా మంత్రులకు కూడా యోగి ఆదిత్యనాథ్ చెమటలు పట్టిస్తున్నారు. వచ్చే 90 రోజుల్లో మంత్రులందరూ తమతో పాటు తమ కుటుంబ సభ్యుల చర, స్థిరాస్తులను బహిరంగంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేయడం సంచలనం కలిగిస్తున్నది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను ప్రతి ఒక్కరూ అక్షరబద్ధంగా, స్ఫూర్తితో వ్యవహరించాలన్నారు.
అంతే కాకుండా మంత్రి కుటుంబంలో ఎవరైనా సరే ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆయన వచ్చే 100 రోజులు, 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలకు సంబంధించి అన్ని శాఖల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు.
మంత్రులందరూ తమ శాఖ అధికారులకు ఈ మేరకు దిశానిర్దేశం చేయాలి. నాణ్యతతో అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాల్సి ఉంటుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు రాష్ట్రవ్యాప్తంగా టూర్ వర్క్ పూర్తి చేయాలని మంత్రులకు సూచించారు. ఇందుకోసం 18 మంత్రి వర్గ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ 18 బృందాలు రాష్ట్రంలోని 18 ప్రాంతాల్లో పర్యటించనున్నాయి.