బాల అదాలత్ను సద్వినియోగం చేసుకోవలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అంజన్ రావు అన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శనివారం నాగర్ కర్నూలు జిల్లాలో బాల అదాలత్ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర కమిషన్ సభ్యులు అంజన్ రావు తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ జిబి సెల్ సమావేశ మందిరంలో శుక్రవారం బాలఅదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజన్ రావు మాట్లాడుతూ శనివారం పట్టణంలోని వెలమ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 నుంచి 4 గంటల వరకు రాష్ట్ర కమిషన్ బెంచ్ ఆధ్వర్యం లో బాలఅదాలత్ను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించిన బాలల సమస్యలను ఇందులో చర్చించి పరిష్కరిస్తామన్నారు. కొవిడ్తో అనాథలుగా మారిన పిల్లలు, అక్రమ రవాణా, అక్రమ దత్తత, వేధింపులకు గురవుతున్న పిల్లలకు సంబంధించిన విషయాలను బెంచ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
బాలల హక్కుల ఉల్లంఘన, బడుల్లో వేధింపులు, పాఠశాలల్లో అడ్మిషన్ల నిరాకరణ, వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు, లైంగిక వేధింపులకు గురైన పిల్లలకు పరిహారం, వైద్య సహాయం అందించడంలో నిర్లక్ష్యం, యాసిడ్ దాడులకు గురైన పిల్లలు, వదిలేయబడిన, నిరాదరణకు గురైన, హెచ్ఐవీ లాంటి వ్యాధులతో వివక్షకు గురైన పిల్లలు, పోలీసులతో కొట్టించడం లాంటి హక్కుల ఉల్లంఘనకు గురైన వారు నేరుగా బెంచ్ కు ఫిర్యాదు చేయాలని కోరారు.
పిల్లలే కాకుండా పిల్లల తరపున తల్లిదండ్రులు, సంరక్షకులు, స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
బాలల హక్కుల పరిరక్షణ కై కమిషన్ కృషి చేస్తుందని అందుకు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సమస్యలతో హాజరై పరిష్కారంతో వెళ్లాలన్నారు.
కార్యక్రమంలో సంక్షేమాధికారిణి వెంకటలక్ష్మి జిల్లా బాలల పరిరక్షణ కమిషన్ చైర్మన్ లక్ష్మణ్ రావు జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఇంతియాజ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.