నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22 స్థానాలకు గాను 22 స్థానాలు గెలుచుకున్న వై ఎస్ ఆర్ సి పి కౌన్సిలర్లు, ఏకగ్రీవంగా గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లు మొత్తం 25 మందిని మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి అభినందించారు.
కౌన్సిలర్లు తాము ఎన్నికల్లో గెలుపొందినట్లుగా మున్సిపల్ కమిషనర్ బి. నాగేశ్వర్రావు నుండి తమ ధ్రువీకరణ పత్రాలు అందుకున్న అనంతరం వెంకటగిరి గ్రామశక్తి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం చేరుకున్నారు.
ఆ తల్లి సాక్షిగా గెలుపొందిన వై ఎస్ ఆర్ సి పి కి చెందిన 25 మంది కౌన్సిలర్లను ఆనం శాలువాలతో సత్కరించి అభినందించారు. వెంకటగిరి మునిసిపల్ ఎలక్షన్ ప్రారంభ రోజు కూడా ఎమ్మెల్యే ఆనం వెంకటగిరి గ్రామశక్తి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తల్లి ఆశీస్సులు తీసుకుని ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక మార్చి 18న ఉంటుందని ఎమ్మెల్యే ఆనం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనం తో పాటు వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు ధనుంజయ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కేంద్ర కమిటీ సభ్యులు కొడవలూరు ధనుంజయ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకులు లక్కమనేని కోటేశ్వరరావు నక్కా వెంకటేశ్వర్రావు, చిట్టేటి హరికృష్ణ, దొంతు బాలకృష్ణ, మంగళపురి వెంకటేశ్వర్లు, ఎస్.కె.యస్దాని భాష, 25 మంది కౌన్సిలర్లు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.