తిరుమల తిరుపతి దేవస్థానాల ఆగమశాస్త్ర సలహాదారుడు వేంకట రమణ దీక్షితులుకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు భావిస్తున్నయి. దేవస్థానం ప్రధాన అర్చకుడుగా పని చేసిన వేంకట రమణ దీక్షితులు చంద్రబాబునాయుడు హయాంలో పదవి విరమణ పొందారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేసిన వేంకట రమణ దీక్షితులు నేరుగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.
ఆయన అనుకున్నట్లుగానే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు కానీ ఆయన ఆశించిన ప్రధాన అర్చకుడి పదవిని మాత్రం వేంకట రమణ దీక్షితులకు జగన్ ఇవ్వలేదు. ఆయనను ఆగమ శాస్త్ర సలహాదారుడిగా నియమించారు. అయితే ఈ పదవితో సంతృప్తి చెందని దీక్షితులు పలు దఫాలుగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనకు ప్రవేశం దొరకలేదు.
ఈ లోపు తిరుమల కొండపై పలు పరిణామాలు జరిగాయి. అవన్నీ కూడా వేంకట రమణ దీక్షితులు అభీష్టానికి వ్యతిరేకంగానే జరిగాయి. ఆయన కుమారులను తిరుమల నుంచి బదిలీ చేసి గోవిందరాజస్వామి దేవస్థానాలలో అర్చకులుగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే వారు గోవిందరాజస్వామి దేవస్థానంలో అర్చకులుగా చేరలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో వేంకట రమణ దీక్షితులు ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెలికి తీసుకు వస్తున్నారు.
ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలిలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చంద్రబాబునాయుడి మనిషి అన్నట్లుగా దీక్షితులు పెట్టిన ట్విట్ తో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. బిజెపి నాయకుడు సుబ్రహ్మణియ స్వామికి అనుకూలంగా కూడా దీక్షితులు ట్విట్ లు పెట్టడం సంచలనం కలిగించింది.
ఇంకా ఆయనను సలహాదారుడి పదవిలో కొనసాగిస్తే ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ ఏర్పడుతుందనే నిర్ణయానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి తగిన ఆదేశాలు ఇచ్చినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది.