విజయనగర పరిధిలోని వ్యాస నారాయణ మెట్ట ప్రాంతంలో జూన్ 1వ తారీఖు నుంచి లాంఛనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన శిల్పారామం సందర్శకుల తాకిడితో సందడిగా మారుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులతో, మహిళలతో శిల్పారామ పరిసరాలు కోలాహలంగా మారాయి.
సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, సత్యారావు మాస్టారు ఆధ్వర్యంలో నిర్వహించిన కర్ర సాము, కత్తి సాము విన్యాసాలు ఆహుతులను అలరించాయి. డీజే సౌండ్ సిస్టంతో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆడిన మ్యూజికల్ ఛైర సరదా సరదాగా సాగింది. చిన్నారుల ఆటపాటలు, కేరింతలు, ఇతర విన్యాసాలతో శిల్పారామంలో సందడి వాతావరణం నెలకొంది. అక్కడికొచ్చిన చిన్నారులు, యువతులు సెల్పీలు దిగి సందడి చేశారు. సందర్శకులు చల్లని వాతావరణంలో.. సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షించి కాసేపు ప్రశాంతంగా గడిపారు.
ప్రదర్శనలో వివిధ ఉత్పత్తులు
స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఉత్తత్తైన వివిధ ఉత్పత్తులను శిల్పారామంలో ఉన్న స్టాల్స్లో ప్రదర్శనకు ఉంచారు. సురవరం చేనేత వస్త్రాలు, బాబా మెట్ట మట్టిపాత్రలు, గిరిజన ఉత్పత్తులైన చింతపండు, రాగి పిండి, తాటిబెల్లం, ఆర్గానిక్ ఆహార పదార్థాలను స్టాల్స్ ద్వారా విక్రయించారు. వివిధ స్వయం సహాయక సంఘాల యూనిట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్లో ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు సందర్శకులు ఆసక్తి కనబరిచారు.
ఇదిలా ఉండగా శిల్పారామంలో జరిగిన మహారాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వారిచే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, వివిధ ఉత్పత్తుల ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లను డీఆర్డీఏ పీడీ కల్యాణ చక్రవర్తి పర్యవేక్షించారు. సందర్శకుల ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కూర్చోడానికి బల్లలు, తాగునీటి సదుపాయం కల్పించారు. ఏపీడీ సావిత్రి, డీపీఎంలు రవి, జయశ్రీ, ఏపీఎంలు, ఇతర అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.