వనపర్తి పట్టణంలో చిరు వ్యాపారులపై మునిసిపల్ యూజర్ చార్జీల మోత తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర తెలుగుమహిళ ప్రధాన కార్యదర్శి నందిమల్ల శారద (మాజీ కౌన్సిలర్) తెలుగుదేశం కౌన్సిలర్ ఏర్పుల లక్ష్మీ డిమాండ్ చేశారు.
ఇటీవల వనపర్తి పట్టణములో చిరు వ్యాపారులైన టిఫిన్ సెంటర్లు,మెస్, టీకొట్టు, ఫ్రూట్ జ్యుస్, కూరగాయల, పండ్ల బండ్ల, కొబ్బరిబోండాల, చికెన్,మటన్ దుకాణాలపై వనపర్తి మున్సిపల్ పాలకవర్గం తడి చెత్త,పొడి చెత్త సేకరిస్తునందుకు ప్రతి నెల యూజర్ చార్జీల క్రింద 500 నుండి1000 రూపాయల వరకు వసూలు చేయాలని తీర్మానం చేయడాన్నివారు తీవ్రంగా ఖండించారు.
అసలే వనపర్తిలో కరోనతో, రోడ్ల విస్తరణతో వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్న వ్యాపారులపై భారాన్ని మోపడాన్ని విమర్శించారు.
చిరు వ్యాపారులు తాము చేస్తున్న వ్యాపారానికి ఏటా పన్నుల రూపములో వాణిజ్య, మునిసిపల్ టాక్సులు కడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పన్నులు విధించడం అనాలోచిత చర్య అని వారు విమర్శించారు.
దీని వల్ల అంతిమంగా ప్రజలపై భారం పడుతుందని, అదే విధంగా బార్లు,హోటల్స్,ప్రైవేటు హాస్పిటల్స్,ఫంక్షన్ హాళ్ల పై కూడా ఈ కొత్త తరహ పన్నులవల్ల వాటి యజమానులు కూడా కష్టమర్స్ పై వేస్తారని చెప్పారు.
వెంటనే ఈ యూజర్ చార్జీల మోతను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.