ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ ఎస్ఐలు, గ్రేహౌండ్స్ శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఐ లకు విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి దిశా నిర్దేశం చేసారు.
ప్రాక్టికల్ శిక్షణ అనంతరం సివిల్ ఎస్ఐల కు పూర్తి స్థాయి పోలీసు స్టేషను బాధ్యతలను అప్పగించగా, గ్రేహౌండ్స్ శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఐల కు ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో బాధ్యతలను అప్పగించారు. వీరంతా ఎస్పీ డీపీఓ లో మర్యాదపూర్వకంగా కలిసారు..
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ – శిక్షణ పూర్తి చేసుకొని పూర్తి స్థాయి ఉద్యోగ బాధ్యతలు చేపట్టినందుకుగాను శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని నెలలుగా శాఖలో వివిధ రకాల విధుల పట్ల అవగాహనకు జిల్లాలో ప్రాక్టికల్ శిక్షణ పొందడం వలన జిల్లా పట్ల, విధుల పట్ల పూర్తి స్థాయి అవగాహన, అనుభవాన్ని సాధించారన్నారు.
స్టేషనుకు వచ్చే బాధితులు, నిరాశ్రయుల పట్ల సానుకూలంగా వ్యవహరించి, వారి ఇబ్బందులను సహృదయంతో అర్ధం చేసుకొని, వారికి న్యాయం అందించేందుకు శక్తి వంచన లేకుండా నిజాయితీతో పని చేయాలన్నారు. విధి నిర్వహణలో చట్టం ముందు అందరూ సమానమని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, బాధితుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించి, న్యాయం చెయ్యాలన్నారు.
అంతేకాకుండా, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, మహిళల రక్షణకు అండగా నిలిచే చట్టాలు, దిశా మొబైల్ యాప్ పట్ల ప్రజలు, మహిళలకు అవగాహన కల్పించే విధంగాను, దిశా యాప్ ను ఎక్కుమ మంది మహిళలు డౌన్ లోడు చేసుకొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ తో ఎస్ఐలు ఎన్. పద్మావతి, జి. శిరీష, నసీమా బేగం, ఎం.వి.రమణ, కే. సీతారాములు, సిహెచ్. హేమంత్ కుమార్, ఎస్. షణ్ముఖరావు, ఆర్ ఎస్ఐలు ఎస్. అక్షయ్ కుమార్, సిహెచ్. మహేష్, జి. గిరిబాబు, ఎస్.కే.నజారుద్దీన్, టి.నీలిమలు ఉన్నారు.