జార్ఖండ్ లోని చినియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖురి గ్రామంలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. చేతబడి చేశారని ఆరోపిస్తూ 70 ఏళ్ల వృద్ధురాలిని అక్కడి గ్రామస్థులు ఆమెను కొట్టి చంపారు. తాను అలాంటి పనులు చేయనని చెబుతున్నా ఆ వృద్ధురాలి మాటను ఎవరూ ఆలించలేదు.
ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు ఆమెను ఇంటి నుంచి ఈడ్చుకెళ్లి 200 మీటర్ల దూరం తీసుకెళ్లి కర్రలతో కొట్టి చంపారని ఆ మహిళ కుటుంబీకులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
వృద్ధురాలు దాడికి పాల్పడిన వారి నుండి కనికరం కోసం వేడుకుంటూనే ఉందని, కానీ ఆమె మొర ఎవరూ ఆలకించలేదని ఫిర్యాదులో తెలిపారు. ఆమె చనిపోయే వరకు కర్రలతో కొట్టారని బంధువులు చెప్పారు. వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు.
మంత్రవిద్య లేదా చేతబడి (black magic) జార్ఖండ్ లో విస్తృతంగా ఉన్న ప్రధాన సామాజిక దురాచారం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం, 2001- 2020 మధ్య మొత్తం 590 మందిని మంత్రవిద్య అనుమానంతో హత్య చేశారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు.
మరోవైపు, రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలోని భర్నో పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్య వయస్కుడిని కొట్టి చంపిన కేసు కూడా తెరపైకి వచ్చింది. 45 ఏళ్ల షమీమ్ అన్సారీ చెట్టు నరికివేయడాన్ని వ్యతిరేకించడంతో, ప్రజలు అతన్ని కర్రలతో కొట్టి చంపారు. కలప మాఫియాను అరికట్టేందుకు అన్సారీ కృషి చేసేవాడు.