కరోనా పుణ్యమా అని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ పట్నం తరలివెళ్లే ముహూర్తానికి మళ్లీ బ్రేక్ పడ్డది. మూఢములు వెళ్లగానే విశాఖపట్నం తరలి వెళదామనుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశ ఇప్పటిలో తీరేలా కనిపించడం లేదు.
మూడు రాజధానుల ప్రకటన చేసి 500 రోజులు దాటింది. ఆ నాటి నుంచి పలు రకాల అడ్డంకులు ఏర్పడుతూ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. విశాఖపట్నం పాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా చేస్తానని అట్టహాసంగా ప్రకటించిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు.
కోర్టుల్లో పలురకాల వ్యాజ్యాలు నడుస్తున్న నేపథ్యంలో డొంకతిరుగుడు మార్గంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించేందుకు సిద్ధం అయ్యారు. సిఎం క్యాంప్ ఆఫీస్ విశాఖ కు తరలిస్తే అది రాజధాని తరలింపు కిందికి రాదని అందువల్ల అలా చేద్దామని భావించారు.
అయితే గత ఏడాది నుంచి ఆ ప్రయత్నం చేస్తున్నా అది సాధ్యం కాలేదు. తొలి విడత కరోనాతో ముందు బ్రేక్ పడగా ఇప్పుడు రెండో విడత కరోనాతో అడుగు ముందుకు పడటం లేదు. మే రెండో వారంలో విశాఖ పట్నం తరలి వెళ్లాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలిచ్చిన జగన్ ప్రభుత్వం అందుకు అందరు హెచ్ ఓ డిలను సిద్ధం చేసింది.
శాఖాధిపతులకు( హెచ్ ఓ డీలకు) మౌఖిక ఆదేశాలు రావడంతో ఉద్యోగస్థులు కూడా విశాఖ తరలి వెళ్లేందుకు మానసికంగా సిద్ధపడ్డారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఎవరికి లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వడం లేదు. మే రెండో వారంలో తరలి వెళ్లేందుకు ముహూర్తం పెట్టుకున్నా సాధ్యం కావడం లేదు.
జగన్ మోహన్ రెడ్డి అట్టహాసంగా చేసిన ప్రకటన అసలు అమలు జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.