తీసుకున్న అప్పు ఇవ్వకపోగా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ సూసైడ్ నోట్ రాసి వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా 11వ వార్డు జోగులకాలనీలో జరిగింది. 11వ వార్డు జోగులకాలనీకి చెందిన శరవణ వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాడు. నగరంలోని రాష్ట్ర మహిళల ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ అంజలి, ఎంఎల్ఎ అనుచరుడు వైసిపి నాయకుడు అయిన సయద్, మరికొంతమంది కలిసి వాలంటీర్ వద్ద కొంత డబ్బును తీసుకున్నారు.
ఆ డబ్బును ఇవ్వాలని వాలంటీర్ అడగడంతో.. వారంతా బెదిరింపులకు దిగారు. ” ఎంఎల్ఎ మనిషిని.. నన్నేమీ చేయలేవు.. ఇలాగే అడిగావంటే నీ కుటుంబాన్ని ఏమైనా చేస్తా…” అంటూ తనను బెదిరించారని.. ఈ కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ వాలంటీర్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న డైరెక్టర్ అంజలి వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని తాను వాలంటీర్ వద్ద తీసుకున్న డబ్బును వెంటనే ఇచ్చేస్తానని, తన పేరును మీడియాకు చెప్పవద్దని కుటుంబీకులను కోరారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.