వాలంటీర్ల ద్వారా నేరుగా లబ్ది దారుల ఇళ్లకే వెళ్లి వృద్దాప్య,వితంతు,వికలాంగ,చేనేత పెన్షన్ల నగదు ను ప్రభుత్వం పంపిణీ చేయిస్తుంది. కరోనా భయం వెంటాడుతున్నా లెక్క చేయకుండా వాలంటీర్లు ప్రతీ నెల 1 వ తేదీ ఉదయం పెన్షన్ లు పంపిణీ చేయటం రాజకీయాలకు అతీతంగా ప్రశంసలు కురిపిస్తున్న మాట కాదనలేనిది.
కరోనా ప్రబలకుండా జాగ్రత్తల్లో భాగంగా ఇప్పటి వరకూ బయో మెట్రిక్ (వ్రేలి ముద్రల ద్వారా వివరాలు సేకరించే) యంత్రాన్ని వినియోగించలేదు. సెప్టెంబర్ 1 వ తేదీ నుండి బయో మెట్రిక్ యధావిధిగా అమలు జరపాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఓ ప్రక్క కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో బయో మెట్రిక్ విధానం వాలంటీర్లకు ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని 32 వార్డుల్లో ఆయా క్లస్టర్ల పరిధిలో సుమారు 395 మంది వాలంటీర్లు విధుల్లో వున్నారు. వీరందరూ నిత్యం ప్రజల వద్దకు వెళుతున్నారు.
కోవిడ్ బారిన పడకుండా గ్లౌజులు,శాని టైజర్లు ఇవ్వలేదు. ఇక బయో మెట్రిక్ ద్వారా పెన్షన్లు పంపిణీకి వాలంటీర్లే వాటిని కొనుగోలు చేసి వెళ్ళాలి. అసలే వచ్చేది రూ.5 వేల జీతం. దీనికి ప్రతీ పనికి మేమే గుర్తొస్తున్నాం. కనీసం కరోనా రక్షణ పరికరాలు సైతం లేకపోతే ఎలా అలా అని వారు ప్రశ్నిస్తున్నారు.
చాలి చాలని జీతంతో కోవిడ్ రక్షణ పరికరాలు కొనుగోలు చేయటం ఇబ్బంది కరంగా మారింది అంటూ పలువురు వాలంటీర్లు ఆవేదన చెందుతున్నారు. బయో మెట్రిక్ అమలయ్యే నేపథ్యంలో ఇందుకు తగిన భరోసా కల్పించాలని లేదంటే విధి నిర్వహణ కత్తి మీద సామే అంటూ వాపోతున్నారు.