ఓటరు జాబితాలో ఓటరు నమోదు, మార్పు చేర్పులకై నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మరి రివిజన్ కార్యక్రమాన్ని ఓటర్లతో పాటు పొలిటికల్ పార్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల ఓటరు జాబితా పరిశీలకులు మానిక్క రాజ్ కన్నన్ కోరారు. మానిక్క రాజ్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ నెం.87, సి.ఎన్. ఆర్ ఉన్నత పాఠశాలలోని పి.ఎస్. నెం. 37 ను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ హాల్లొ ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం స్పెషల్ సమ్మరి రివిజన్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఓటరు జాబితాను సవరణ చేస్తూ ఉంటుందన్నారు. ఎన్నికల రోజు లేదా ముందు రోజు జాబితాలో పేర్లు గల్లంతు అయ్యాయని, మరణించిన వారి లేదా స్థానికేతరుల పేర్లు జాబితాలో ఉన్నాయని ఫిర్యాదులు వస్తుంటాయన్నారు. అప్పటికే ఎన్నికల సంఘం ఆన్ లైన్ పోర్టల్ లో జాబితా ఉంచి ఉంటుందని అప్పడు లెవనెత్తని సమస్యలు ఎన్నికల రోజున లెవనెత్తడంతో ఎన్నికల కమిషన్ ఏమి చేయలేని పరిస్థితితో పాటు ఫిర్యాదులను కొట్టిపారేస్తుందన్నారు.
అందువల్ల స్పెషల్ సమ్మరి రివిజన్ ను అన్నీ పొలిటికల్ పార్టీలు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబితాలో తొలగించాల్సిన పేర్లు ఉంటే ఫారం 7 లో ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొత్త ఓటరు నమోదుకై ఫారం 6 ద్వారా దరఖాస్తు చేరుకోవాలని సూచించారు. జాబితా పారదర్శకంగా ఉండేందుకు పొలిటికల్ పార్టీ తరపున ప్రతి పోలింగ్ బూత్ కు ఒక బూత్ లెవల్ అసిస్టెంట్ ను నియమించుకోవాలని సూచించారు. బి.ఎల్.ఓ, బి.ఎల్.ఏ లు సమన్వయంతో పని చేసి తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేసుకోవచ్చని తెలిపారు.
అభ్యంతరాల స్వీకరణకు ముసాయిదా
ఈ నెల ఒకటవ తేదీన ఒకటవ తేదీన జిల్లాలోని అసెంబ్లీ ఓటరు ముసాయిదా జాబితాను ప్రచురించి అభ్యంతరాల స్వీకరణ కై అన్ని పోలింగ్ బూత్ లలో జాబితా పెట్టడం జరిగిందన్నారు. అన్ని పొలిటికల్ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారించి బూత్ లెవల్ అధికారులకు సహకరించాలని సూచించారు. వచ్చిన ఆన్ లైన్ ఆఫ్ లైన్ దరఖాస్తులను ఎప్పటికపుడు ఈ.ఆర్.ఓ నెట్ లో అప్డేట్ చేస్తూ దరఖాస్తుల పరిశీలనకు బి.ఎల్.ఓ లను పంపించాలని ఈ.ఆర్.ఓ లను ఆదేశించారు.
బూత్ లెవల్ అధికారులకు మరోసారి శిక్షణ ఇవ్వాలని ఏ దరఖాస్తు ఎందుకు ఉపయోగపడుతుంది, వాటిని క్షేత్రస్థాయిలో ఎలా పరిశీలించాలి అనే అంశాలను అర్ధమయ్యే రీతిలో అవగాహన కల్పించాలన్నారు. అంతకు ముందు పోలింగ్ బూత్ లను పరిశీలించిన అబ్జర్వర్ బి.ఎల్.ఓ లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బి.ఎల్.ఓ రిజిస్టర్, ముసాయిదా జాబితాను పరిశీలించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఇల్లిల్లు తిరుగుతున్నారా , ఏ సమస్యలు ఉన్నాయి అని ఆరా తీశారు.
జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ముసాయిదా జాబితా ముద్రించి అన్ని పోలింగ్ బూత్ లలో ఉంచడమే కాకుండ రెండు రోజుల పాటు బి.ఎల్.ఓ లు పి.ఎస్ లో కూర్చొని ఫిర్యాదులు, దరఖాస్తులు స్వీకరించే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బి.ఎల్.ఓ లకు మరోసారి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పొలిటికల్ పార్టీలతో సమన్వయం చేసుకొని ఓటరు జాబితాను సిద్ధం చేయడం జరుగుతుందని తెలియజేసారు.
ఈ సమావేశంలో అన్ని పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో పాటు ఆర్డీవోలు, స్థానిక తహశీల్దార్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.