వారంతా 21 ఏండ్ల తర్వాత ఒక్క చోట కలిశారు. ఆత్మీయంగా పలకరించుకుని యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఎన్నేండ్లయ్యిందో కలుసుకొని అంటూ పరస్పర కరచలనాలతో ఆనందం వ్యక్తం చేశారు. వారే వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని 1999-2000 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థినులు.
ఆదివారం పూర్వవిద్యార్థినీలు స్థానికంగా ఉన్న ఇకో ఉద్యానవనంలో సమావేశమయ్యారు. ఎవరు ఏ స్థాయికి ఎదిగారో ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటూ వివరాలు తెలుసుకున్నారు. వారంతా ఇరవై ఏళ్ల క్రితం ఒకే తరగతి గదిలో చదువుకున్నారు.
ఆడుతూ పాడుతూ చదువుకుని, వివాహనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఎట్టకేలకు కొందరి స్నేహితుల చొరవతో మళ్లీ కలుసుకున్నారు. ఆపై ఆనందానికి అవధుల్లేకుండా తమ పిల్లలతో కలిసి చిన్ననాటి ఆటాపాటలతో సందడిగా గడిపారు.
ఒకరికొకరు పలకరించుకుంటూ తమ స్నేహితులతో ముచ్చటించుకున్నారు. పాఠశాలలో చదివిన రోజులు, జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అనంతరం అందరూ సహపంక్తి భోజనాలు చేశారు. కొందరితో ఫోన్ లో అడపాదడపా మాట్లాడుతున్నప్పటికీ ప్రతక్షంగా తోటి స్నేహితులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ సురేఖ హర్షం వెల్లిబుచ్చారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి