విజయనగరంను సమస్యలు లేని నగరంగా మారుస్తామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరంను రాజీ పడకుండా అభివృద్ధి చేసారని పేర్కొన్నారు. ధర్మపురి లో 30, 31 డివిజన్ల పరిధిలో 2 కోట్ల అంచనా విలువతో, కె.ఎల్ పురం 45, 47 డివిజన్ల పరిధిలోను 1.60 కోట్ల రూపాయల అంచనా విలువతో నిర్మించిన 5 లక్షల కెపాసిటీ గలా వాటర్ ట్యాంక్ లను నేడు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల తో కలసి మంత్రి బొత్స ప్రారంభించారు.
రెండు చోట్లా జరిగిన బహిరంగ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నగర వాసుల మంచినీటి సౌకర్యం కోసం ఇప్పటి వరకూ 7 ట్యాంక్ లను నిర్మించామని, నేటి తో 9 ట్యాంక్ లు అవుతున్నాయని తెలిపారు. శాసన సభ్యులు కోలగట్ల నగర అభివృద్ధికి నిబద్ధత తో పని చేస్తున్నారని కొనియాడారు. అమృత్ పధకం క్రింద మరో 60 కోట్లతో ముషిడిపల్లి నుండి విజయనగరం వరకు కొత్త పైప్ లైన్ వేసి పట్టణానికి రెండు పూటలా నీరందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ గౌరవంగా బతకాలని ముఖ్యమంత్రి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే అయిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఈ రెండు వాటర్ ట్యాంక్ లను ఏడాది క్రితం శంఖుస్థాపన చేసి పూర్తి చేశామని, నీటి వెతలు లేకుండాచేయాలని భావించి ఈ ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా నిత్యం అందుబాటులో ఉంటామని ప్రభుత్వం పై, మా పై విశ్వాసం ఉంచాలని కోరారు.
ఈ సమావేశాల్లో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఎం.ఎల్.సి డా.సురేష్ బాబు, కార్పొరేటర్లు గణపతి, సంతోషి తదితరులు ప్రసంగించారు. మున్సిపల్ కమీషనర్ శ్రీరాములు నాయుడు, పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ గణపతి రావు, ఈ ఈ దక్షిణా మూర్తి, వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.