విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు సిగ్గుచేటని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. గతం మరిచి, ప్రజలను మభ్యపెట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. చీపురుపల్లిలో విజయనగరం జిల్లా టీడీపీ అధినేత నాగార్జున మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ బొత్స అంటే ఏమిటో తెలుసన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ అంటూ సత్తిబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యమంటే ఆయనకు ఎక్కడ గౌరవం ఉందని ప్రశ్నించారు.
‘‘మొన్నటి సారి విజయనగరం జిల్లా పరిషత్తు స్థానం ఎస్సీ మహిళకు కేటాయిస్తే ఆయన కుటుంబ సభ్యుడి కోసం రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ను మార్చలేదా? కుటుంబ సభ్యుడి మెడికల్ సీటును ఒక కళాశాల నుంచి మరో కళాశాలకు మార్చేందుకు రాత్రికి రాత్రే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2006 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ కేఏ నాయుడు గెలిస్తే.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రిజల్టు మార్చినది నిజం కాదా?’’ అని ప్రశ్నించారు. ‘‘స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో తాము చర్చ పెట్టకుండా పారిపోతున్నామని అంటున్నారు.. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. వాస్తవాలు తీసుకుని చీపురుపల్లి మూడు రోడ్లు జంక్షన్కు రావాలా, విజయనగరం రావాలా, విజయవాడా రావాలా? చెప్పండి. నాలుగేళ్లుగా కేసు విచారణ చేస్తున్నారు కదా.. డబ్బులు ఎక్కడ చేతులు మారాయో చెప్పగలరా?’’ అంటూ నిలదీశారు. తాము రోడ్లెక్కి ఆస్తులు ధ్వంసం చేయాలని ఉద్దేశమా? అని నాగార్జున ప్రశ్నించారు.
‘‘శాసనసభ వేదికగా చర్చించాలి అంటున్నారు.. వైసీపీ నాలుగున్నరేళ్ల కాలంలో శాసనసభను ఏనాడైనా సజావుగా జరుపుకొన్నారా? 23 మంది ఉన్న మాతో చర్చించలేక స్పీకర్ను అడ్డం పెట్టుకుని తప్పించుకున్నది మీరు..’’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించకుండా సీఎం పదవి కోసం రెండు రాష్ట్రాలుంటే తప్పేంటన్న మంత్రి బొత్సకు.. ఇటువంటి మాటలు చెప్పే అర్హత లేదని టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు నాగార్జున అన్నారు.