వచ్చే నెల అక్టోబర్ నెల 29, 30, 31 తేదీలలో జిల్లాలో నిర్వహించే పైడి తల్లి అమ్మవారి ఉత్సవాలను అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ వైభవోపేతంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు సూచించారు. అందరి సమాలోచనలతో పెద్ద ఎత్తున జరగాలని, మూడు రోజుల ఉత్సవాల్లో యథావిధిగా కార్యక్రమాలన్నిటినీ మరింత ఆకట్టుకునేలా నిర్వహించాలని అన్నారు. ఈ మేరకు విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో అమ్మవారి పండగ, విజయనగరం ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు. సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చేయాలని సూచించారు. ఉత్సవ్ కమిటీ లో ఆసక్తి గల వారు కొత్త గా సభ్యులుగా చేరాలనుకునే వారు జిల్లా కలెక్టర్ ను కలసి వారి వివరాలను సమర్పించాలని తెలిపారు. కమిటీ సభ్యులు అధికారులు కలసి చర్చించుకొని జిల్లా కలెక్టర్ ఆమోదం తో వేదిక వారీగా కార్యక్రమాలను రూపొందించాలని తెలిపారు.
డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలు మూలల నుండి పెద్ద ఏతున భక్తులు వస్తారని, వారిని పూర్తి స్థాయి లో సంతృప్తి చెందేలా ఏర్పాట్లు ఉండాలని అన్నారు. గత ఏడాది నిర్వహించిన వేదికలలో, జిల్లా అధికారులను ఇంచార్జ్ లు గా పెడుతూ కమిటి సభ్యులను వేయడం జరుగుతుందని, ఇరువురు సమన్వయం తో పని చేయాలని అన్నారు. సోమవారం మెగా మ్యుజికల్ నైట్ నిర్వహించాలని, ఆనంద గజపతి ఆడిటోరియం లో స్థానిక కళాకారుల తో ప్రదర్శనలు నిర్వహించాలని తెలిపారు. పుష్ప ప్రదర్శన, క్రీడలు, డాగ్ షో , జానపద కళలు తదితర కార్యక్రమాలను గతం కంటే మెరుగ్గా రూపొందించాలని తెలిపారు. ఈ ఏడాది వి.ఐ.పి పాస్ లను ముద్రించడం లేదని, సామాన్య భక్తులకు దర్శనాలకు ఇబ్బంది కలగా కుండ చూడాలని తెలిపారు. వి.ఐ.పి ల జాబితా ముందుగానే తయారు చేసుకొని వారికి కేటాయించిన సమయాల్లో దర్శనాలను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులంతా సోమవారం లోగానే దర్శనాలు పూర్తి చేయాలన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ స్థానిక కళాకారులందరికీ అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలని తెలిపారు. అవిభాజిత జిల్లా ను యూనిట్ గా తీసుకొని అవకాశాలు కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ అక్టోబర్ 4,5 తేదీలలో కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని అందరు హాజరై వారి సలహాలను, సూచనలను అందించి కార్యక్రమాలు జయప్రదం అయ్యేలా చూడాలని కోరారు. ఈ సమావేశం లో నగర మేయర్ విజయలక్ష్మి, జిల్లా ఎస్.పి దీపిక, జే.సి. మయూర్ అశోక్, డి.ఆర్.ఓ అనిత . సహాయ కలెక్టర్ త్రివినాగ్ , దేవాలయం ఎ.సి , ఉత్సవ్ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.