విజయనగరంలో ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు మమేకమయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ విద్యార్ధులు సైబరు మోసగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా ఉచ్చులో చిక్కుకోవద్దని విద్యార్థులను కోరారు. సోషల్ మీడియా ప్రభావానికి లోనైతే భవిష్యత్తు అందకారమేనని అన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో హద్దుల్లేని స్నేహాలు విద్యార్ధినుల జీవితాలను నాశనం చేస్తున్నాయన్నారు. కావున, విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని, అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు.
లక్ష్య సాధన కొరకు కృషి చెయ్యాలని, తల్లిదండ్రుల కలలను నిజం చేయాలన్నారు. టెక్నాలజీ అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని, ఇంటర్నెట్ ను విషయ సంగ్రహణకు వినియోగించుకొని నిర్దేశించుకున్న లక్ష్యమని చేరుకోవాలన్నారు. ఫేస్ బుక్, ఇన్స్ స్టాగ్రాం, ట్విట్టర్ ద్వారా పరిచయాలు అయ్యే వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత ఫోటోలను అప్లోడ్ చేయవద్దని విద్యార్థులకు డిఎస్పీ ఆర్.గోవిందరావు సూచించారు. సైబరు మోసాలకు గురైతే 1930 కు సమాచారం అందించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ వి.అశోక్ కుమార్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.